తిరువనంతపురం: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం గాలిలో ఉండగా ఒక ఇంజిన్లో ఆయిల్ స్థాయిలు వేగంగా పడిపోయాయి. గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఆ ఇంజిన్ను ఆఫ్ చేసి మరో ఇంజిన్తోనే ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. (Air India Express) అయితే పైలట్లు ఎదుర్కొన్న ఈ తీవ్ర పరిస్థితి గురించి అందులోని ప్రయాణికులకు ఏమాత్రం తెలియలేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన బోయింగ్ 737 ఫ్లైట్ ఐఎక్స్ 415, కేరళలోని కొచ్చిన్ నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి బయలుదేరింది. 50 నిమిషాల ప్రయాణం తర్వాత 36,000 అడుగుల ఎత్తులో విమానం గాలిలో ఉండగా ఇంజిన్ 1లో ఆయిల్ పరిమాణం వేగంగా పడిపోయింది. పైలట్, కో-పైలట్ దీనిని గమనించారు. ఆయిల్ స్థాయిలు ఇంకా పడిపోతుండటంతో వారు అప్రమత్తమయ్యారు. అబుదాబి మార్గాన్ని విరమించుకుని వెనక్కి మళ్లించారు. విమానం తిరిగి కొచ్చిన్కు మళ్లుతున్నట్లు ఏటీసీకి తెలియజేశారు.
కాగా, ఆ విమానం తిరిగి వెనక్కి ప్రయాణించినప్పుడు అన్ని ప్రామాణిక భద్రతా విధానాలను పైలట్లు పాటించారు. ఇంజిన్ ఆయిల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. విమానం వెనక్కి మళ్లిన సుమారు 45 నిమిషాల తర్వాత ఇంజిన్ 1లో ఆయిల్ ప్రెషర్ హెచ్చుతగ్గులకు గురవ్వడం ప్రారంభమైంది. కాక్పిట్ గేజ్పై రెడ్ జోన్లోకి ప్రవేశించింది. ఇంజిన్ 1లోని ఆయిల్ ప్రెషర్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అది సూచించింది. ఈ నేపథ్యంలో పైలట్లు మరింత అలెర్ట్ అయ్యారు. నాన్ నార్మల్ చెక్లిస్ట్ను అనుసరించి ఇంజిన్ 1ను ఆపివేశారు. కేవలం ఇంజిన్ 2పై ఆధారపడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
మరోవైపు అధిక బరువున్న బోయింగ్ 737 విమానాన్ని ఒకే ఇంజిన్తో ల్యాండింగ్ చేయడం అనేది అధిక శ్రమతో కూడుకున్న, అత్యంత ప్రమాదకరమైన విన్యాసం. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్లు దానిని సునాయాసంగా పూర్తి చేశారు. కాగా, కాక్పిట్లో జరిగిన ఈ తీవ్ర పరిణామం గురించి ఆ విమానంలోని ప్రయాణికులకు ఏ మాత్రం తెలియలేదు.