నల్లగొండ: నల్లగొండ (Nalgonda) మున్సిపాలిటీని హస్తం పార్టీ చేజిక్కించుకున్నది. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం (No Confidence Motion) నెగ్గింది. జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన ఓటింగ్లో కాంగ్రెస్కు అనుకూలంగా 41 ఓట్లు, బీఆర్ఎస్కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా, మిగిలిన సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 48 కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో బీఆర్ఎస్ 20 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ 20, బీజేపీ 6, ఎంఐఎం ఒకటి, స్వతంత్రులు ఒకరు చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు.
అయితే శాసససభ ఎన్నికలు సమయంలో బీఆర్ఎస్కు చెందిన 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల తరువాత మరో ఆరుగురితోపాటు స్వతంత్రులు కలిపి మొత్తం ఏడుగురు కాంగ్రెస్లో చేరారు. దాంతో మున్సిపాలిటిలో కాంగ్రెస్ బలం 34కు చేరింది. వీరంతా కలిసి చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించారు. కాగా, అవిశ్వాసం తీర్మానంపై జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్కు 41 ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే బీఆర్ఎస్ విప్ జారీచేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవీ గండం ఏర్పడనుంది.