– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, ఏప్రిల్ 04 : తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నకిరేకల్లో శనివారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. కాంగ్రెస్ గుండాల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక రకంగా అరాచకాలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నారన్నారు.
ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపైనే దాడులు చేశారంటే రాష్ట్రమంతా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి ఇలాంటి సంఘటనలకు వత్తాసు పలకడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి చిల్లర దాడులకు కేసీఆర్ సైన్యం కొంచెం కూడా భయపడదన్నారు. ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, కాంగ్రెస్ ను రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు తెలిపారు. ఎన్ని అరాచకాలు, అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.