సూర్యాపేట, ఫిబ్రవరి 04 : ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై వేటు వేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని 3, 5, 6, 22, 31, 39వ వార్డుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించగా ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి కేరఫ్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నారు. ఏం సాధించి ఓటు అడుగుతున్నారని కాంగ్రెసోళ్లను నిలదీయాలన్నారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేదో చెప్పి ఓటు అడగమనాలన్నారు. రోడ్లన్నీ చెత్త, కరెంట్ కోతలు, మురుగు దుర్వాసన, దోమల బెడద ఇదే వాళ్ల అభివృద్ధి అన్నారు.
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇద్దరు మంత్రులు కూడా అరాచక శక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఇప్పటి దాకా అభ్యర్థులను, ఇప్పుడు ప్రజలను భయపెట్టే పనిలో ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్దే కొనసాగించే పరిస్థితి లేదని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. కాంగ్రెస్ పెడుతున్న ఇబ్బంది కండ్ల ముందే కనబడుతుందన్నారు. రౌడీ రాజకీయాలకు, సిండికేట్ దంధాలు మళ్లీ మొదలైనయని, అటువంటి అరాచక శక్తులను అధిలోనే అంతమోందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకు మీ చేతిలో ఉన్న ఓటే సరైన ఆయుధమన్నారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని ఇదే ఉత్సాహంతో అన్ని వార్డుల్లో ముందుకు సాగాలన్నారు. నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు సమన్వయంతో పని చేయాలన్నారు. సూర్యాపేట ప్రజలు చాలా చైతన్యవంతులని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మరొమారు చైతన్యాన్ని చాటాలన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్ కి కనపడకపోవడం విచారకరమన్నారు. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్ధమౌతున్నా చర్య తీకోకపోవడం దురదృష్టకరమని, స్పీకర్ ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, పార్టీ పిరాయింపు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడతలేదా అని ప్రశ్నించారు. బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారన్నారు. స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్ట పరంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారన్నారు. స్పీకర్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే అన్నారు. స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదన్నారు. వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి