నల్లగొండ ప్రతినిధి, జూన్ 17(నమస్తే తెలంగాణ)/నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు జనం కరువయ్యారు. నల్లగొండకు చేరుకున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ నేతల మధ్య అధిపత్య పోరు ఎప్పటిలాగే కొనసాగింది. శనివారం నల్లగొండ పట్టణంలో సాగిన పాదయాత్రలో కార్యకర్తల ఊసే లేదు. వచ్చిన కొద్దిమంది కూడా పోటాపోటీ నినాదాలతో వైరి ప్రదర్శనకు నిలిచారు. ఒక దశలో తోపులాట వరకూ వెళ్లారు. గడియారం సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ప్రియాంక గాంధీని తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసలు అడ్రెస్సే లేరు. తన అనుచరులను కూడా అంటీముట్టనట్లుగా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది.
దీంతో కార్నర్ మీటింగ్ కు స్పందన కరువైంది. ఇదే సమయంలో వేదికను మొత్తం తమ కంట్రోల్ కి తెచ్చుకుని ఇతర నేతలను తీవ్రంగా అవమానపర్చారు. ఇతరులు వేదికపైకి రావద్దంటూ బాహాటంగానే ప్రకటించారు. అయితే టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తన వర్గంతో కలిసి గడియారం సెంటర్లో మీటింగ్లో పాల్గొనడానికి వచ్చారు. మీటింగ్ రథంపైకి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వచ్చిన చెరుకు సుధాకర్కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో కలత చెందిన చెరుకు సుధాకర్ ప్రచార రథం నుంచి దిగి వెళ్లిపోయారు. ఇక సభ జరుగుతున్న సేపు ఏం జరుగుతదోనన్న ఆందోళన కనిపించింది. జిల్లా కేంద్రంలో సీఎల్పీ నేత యాత్రలోనూ తమ తీరు మార్చుకోని నేతల తీరును క్యాడర్ తిట్టుకుంటూ వెళ్లిపోవడం కనిపించింది. భట్టి పాదయాత్ర జిల్లాలో మొదలైన నాటి నుంచి కలహాలు కొనసాగుతూనే ఉన్నాయి.