– నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
– హాలియాలో బీఆర్ఎస్ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ
హాలియా, సెప్టెంబర్ 02 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం హాలియాలో మాజీ ఎమ్మెల్యే భగత్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ప్రధాన సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీని అమలు చేయడంతో పాటు 420 హామీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ వెయ్యి రోజులైనా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవన్నారు.

వెయ్యి రోజుల్లో ఏ ఒక్క వర్గాన్ని సంతృప్త పరచని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ నాయకుల నైజంగా మారిందన్నారు. వెయ్యి రోజుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేసి మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనమైందని, రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని, తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో సబండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయనున్నదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.