రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో అమరువీరుల చిత్రపటాలకు నివాళులర్పించి మౌనం పాటించారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిని స్మరించుకున్నారు. జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై వారి త్యాగాలను వివరించారు. పలుచోట్ల సమావేశాలు ఏర్పాటుచేసి అమరుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం వారితో కలిసి సహఫంక్తి భోజనం చేశారు.
త్యాగధనులకు జోహార్లు
హైదరాబాద్లో గురువారం తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అపూర్వ ఘట్టంలో భాగస్వాములయ్యారు. అమరులకు నివాళులర్పించారు.