సూర్యాపేట, మార్చి 22 : ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఒక వ్యక్తి రూ. 50 వేలలోపు నగదు మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుపోవద్దని సూచించారు.
నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే వాటిని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తామన్నారు. పది లక్షల రూపాయలకు పైగా నగదు పట్టుబడితే ఆదాయాపు పన్ను శాఖకు అప్పగిస్తారని తెలిపారు. అకౌంట్ పాస్బుక్, ఏటీఎం చిట్టి, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు సంబంధిత బిల్లులు, లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇన్చార్జిగా జిల్లా పరిషత్ సీఈఓ అప్పారావును నియమించామని, ఆయన ఫోన్ నంబర్ 8374566222లో సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్రాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఏఓ సుదర్శన్రెడ్డి , శ్రీనివాసరాజు పాల్గొన్నారు.