సూర్యాపేట, మార్చి 27 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చెక్పోస్టులు, ఇతర తనిఖీల్లో పట్టుబడిన నగదు, వస్తువులకు బాధితులకు రసీదు అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోలీస్, ఎక్సైజ్ టీమ్లు నిరంతరం ముమ్మర తనిఖీలు చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి, ఇతర సామగ్రిని కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చాలని సూచించారు.
వాటిని గ్రీవెన్స్ సెల్ ద్వారా బాధితులకు అందించనున్నట్లు తెలిపారు. అందుకు బాధితులు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.85.18 లక్షల నగదు, రూ.69 లక్షల విలువ చేసే 4,437 లీటర్ల మద్యం, రూ.23.32 లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ మొత్తం రూ.1,77,62,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు.