సూర్యాపేట, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్రెడ్డితో కలిసి ప్రజాపాలన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మిగిలిన ఐదు గ్యారెంటీల అర్హులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
ప్రతి కుటుంబానికీ దరఖాస్తు ఫామ్లు ముందస్తుగా ఉచితంగా అందిస్తామని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు నిర్వహించే గ్రామ, పట్టణ సభల్లో ఈ ఫామ్లు తీసుకుంటామని తెలిపారు. అందుకోసం గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డుల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తులు తీసుకునేందుకు చిన్న గ్రామ పంచాయతీల్లో 4 కౌంటర్లు, మధ్యస్థ గ్రామాల్లో 8 కౌంటర్లు, పెద్ద గ్రామాల్లో 12 కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
గ్రామ సభల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన చోట హెల్త్ క్యాంపులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభలు నిర్వహించాలని, తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓ, డిప్యూటీ తాసీల్దార్ టీములుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రజా పాలనపై విసృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ కిరణ్కుమార్, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, సూర్యనారాయణ, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, డీఎల్పీఓ సాంబిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట సిటీ : ప్రజా పాలనలో భాగంగా నిర్వహించే గ్రామ, పట్టణ సభలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన సోమవారం పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని, మహిళలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు జరిగే సభల్లో భద్రతా లోపాలు లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోకార్, పెట్రోలింగ్ పెంచాలన్నారు. ఈ సమావేశంలో కోదాడ డీఎస్పీ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజేశ్, మహేశ్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.