నల్లగొండ, నవంబర్ 29: సాధారణ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధంమైంది. నల్లగొండ నియోజక వర్గంలో ఆర్వో రవి ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం మధ్యాహ్నం వరకు ఎన్నికల సామగ్రిని తీసుకోని వారికి నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లిపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,44,446 మంది ఓటర్లు ఉండగా వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 284 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటున 900 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సామగ్రిని తీసుకెళ్లేందుకు 85 వాహనాలు ఏర్పాటు చేసిన యంత్రాంగం 28 సెక్టార్ ఆఫీసర్ల ద్వారా 28 రూట్లల్లో పంపించారు. వీరు గురువారం సాయంత్రం వరకు ఆయా పోలింగ్ స్టేషన్లకు వెళ్లి నేడు జరగనున్న పోలింగ్కు ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పీఓతో పాటు ఏపీఓ, ఇద్దరు ఓపీఓలు విధులు నిర్వహించనుండగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 52 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇద్దరు పోలీసు సిబ్బందితో 568 మందితో నిఘా పెట్టిన అదికారులు ఎస్లు, సీఐలు, డీఎస్పీతో పర్యవేక్షించనున్నారు.
నేటి పోలింగ్ నిర్వహించిన అనంతరం అదే రూట్లల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను వాహనాల్లో తీసుకొని నల్లగొండలో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రంలోకి తీసుకొచ్చి తిరిగి అక్కడ నుంచి ఆర్వో పరిశీలన అనంతరం దుప్పళ్లపల్లిలోని ఎస్డబ్ల్యూసీ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్ల్లోకి తరలించి భద్రపరచనున్నారు.
డీఆర్సీ కేంద్రం కలెక్టర్, ఎస్పీ పరిశీలన
నల్లగొండ నియోజక వర్గ కేంద్రానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రీసోర్స్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వ రావు సందర్శించి పరిశీలించారు. మొత్తం పోలింగ్ కేంద్రాల, సిబ్బంది కేటాయింపు తెలుసుకొని సామగ్రిని తీసుకెళ్లి పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఎన్నికల సిబ్బందికి సూచించారు. వారి వెంట ఆర్వో రవి, మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్ ఉన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు : ఆర్వీ కర్ణన్
నల్లగొండ, నవంబర్ 29: ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న పనుల గురించి డిస్ట్రిబ్యూషన్ ఆండ్ రిసెప్షన్ సెంటర్లను తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి, ఓటర్లు తమ ఓటు హకు స్వేచ్ఛగా వినియోగించు కునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. పంపిణీ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి చేయడం జరుగుతుందని ఎన్నికల విధుల్లో పాల్గొని సిబ్బంది అధికారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు, 5 గురికి మించి గుమిగూడ వద్దని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిక్షణం అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. గురువారం జరుగబోయే ఎన్నికలకు జిల్లాలో అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట సాధారణ పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం, పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనా, ఎస్పీ అపూర్వ రావు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాటిల్ హేమంత్ కేశవ్ , శ్రీనివాస్, చెన్నయ్య, శ్రీరాములు, రవి, ఎన్నికల విభాగ ం సిబ్బంది ఉన్నారు,