నల్లగొండ, డిసెంబర్ 27: నల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల్లో గత వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం నిల్వలు ఉన్నాయా? లేవా? అనే కోణంలో పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు మిల్లులతోపాటు హాలియా, మిర్యాలగూడ మిల్లుల్లో తనిఖీలు కొనసాగాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి వానకాలం సీజన్లో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో 96శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు.
ఇక యాసంగి సీజన్కు సంబంధించి 4.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా అందులో 29శాతం బియ్యం ఎఫ్సీఐకి పెట్టారు. మిగిలిన నిల్వలు ఉన్నాయా లేదా ఉంటే మిల్లింగ్ చేస్తున్నారా? అని తనిఖీ బృందాలు ఆరా తీస్తున్నాయి. మిల్లర్లు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించిన ధాన్యం సకాలంలో మిల్లింగ్ చేయకుండా, వాటిని వ్యాపార నిమిత్తం వినియోగించుకొని మరో సీజన్లో వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా రేషన్ బియ్యం కూడా పలు మిల్లుల్లో రీసైక్లింగ్ అవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలు నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నది.
ఇటీవల నల్లగొండ జిల్లా పరిషత్ మీటింగ్లో పలువురు సభ్యులు కూడా సీఎమ్మార్పై పలు ఆరోపణలు చేశారు. రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని పూర్తిగా మిల్లర్లు విక్రయించి మరో సీజన్లో తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి సకాలంలో సీఎమ్మార్ రావడం లేదని ఆరోపించారు.