నల్లగొండ, ఫిబ్రవరి 16 : గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీడీఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీఓ గ్రామీణ తాగునీటి సరఫరా పనులపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా పరిశుభ్రతపై దృష్టి సారించాలని, వేసవి దృష్ట్యా ఎకడ మొకలు ఎండిపోకుండా చూడాలని, ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులపై దృష్టి సారించాలని, సాధ్యమైనంత ఎకువగా పనులు గుర్తించాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఆయా మండలాల వారీగా చేతి వృత్తుల వారిని గుర్తించి లక్ష్యాన్ని నిర్దేశించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం మిచ్చి నూటికి నూరు శాతం వీటిని పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పూర్తిపై దృష్టిసారించాలన్నారు. మంజూరు ఇచ్చిన సీసీ రోడ్లన్నింటిని వెంటనే పూర్తిచేసేలా చూడాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ , ఆయా అంశాల వారీగా ఎంపీడీఓలతో సమీక్షిస్తూ పనుల పూర్తికి సమయాన్ని నిర్దేశించారు. సమావేశానికి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఎల్డీఎం శ్రామిక్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్నికలపై నిర్వహించిన స్వీప్ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో ఓటు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కిరణ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, స్వీప్ నోడల్ అధికారి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
దామరచర్ల : యాదాద్రి పవర్ప్లాంటు పనులను కలెక్టర్ హరిచందన శుక్రవారం పరిశీలించారు. ప్లాంటులోని టీఎస్ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికార్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ప్లాంటు పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటుగా ఈనెల 20న ప్లాంటు వద్ద నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లను పరిశీలించారు. ప్లాంటు ఏర్పాటుకు తొలుతగా అన్ని అనుమతులు వచ్చినప్పటికీ ఇటీవల రెండు స్వచ్ఛంద సంస్థలు ఎంజీటీలో కేసులు వేయడంతో కేంద్ర పర్యావరణ శాఖ తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆదేశించిందని, ఈనెల 20న జిల్లా పర్యావరణ శాఖ అధికారు లు గ్రామసభకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించి గ్రామ సభ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్, ఆర్డీఎ చెన్నయ్య డీఎస్పీ రాజశేఖర్రాజు, తాసీల్దార్ శంకర్నాయక్, ఆర్ఐ సతీశ్ ఉన్నారు.