నీలగిరి, ఫిబ్రవరి 8 : రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. గురువారం పానగల్లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళిక గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా సురక్షిత తాగు నీటి సరఫరా చేయాలన్నారు. ఇంట్రా విలేజ్ లీకేజీలు అరికట్టాలని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఎల్డీఎఫ్ నిధులు నుంచి ఖర్చు చేయాలని చెప్పారు. తాగు నీటి సమస్యపై ఎవరు ఫోన్ చేసినా పరిష్కరించాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, ఏఈలు తాగు నీటి ఎద్దడి లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఎంజీ యూనివర్సిటీలో గురువారం జిల్లా కలెక్టర్ హరిచందన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోపాల్రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. యూనివర్సిటీలో సౌకర్యాలను పరిశీలించి వివిధ స్థాయిలో ఉన్న పనులకు సంబంధించి సూచనలు చేశారు. ఇంజినీరింగ్ కళాశాల, క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియాన్ని కలెక్టర్ సందర్శించారు. అనంతరం పట్టణ శివారులోని ఎస్ఎల్బీసీ గంధంవారిగూడెంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం కోసం అధికారులతో కలిసి అమె స్థల పరిశీలన చేశారు. ఆమె వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ వంశీకృష్ణ, ఏఈ సంతోష్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తాసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.