నల్లగొండ, జనవరి 26 : ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ అందజేసి సర్కార్ లక్ష్యాన్ని నెరవేర్చుతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆమె జాతీయ పతాకం ఆవిషరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నదన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 39,77,469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పారు. డిసెంబర్ 9న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వైద్యం పొందేలా ఏర్పాటు చేసిందన్నారు. 6 గ్యారెంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహ జ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లుతో పాటు చేయూత పథకాల కోసం 5,27,492 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో పంట పెట్టుబడి సహాయం కింద 2023-24 యాసంగి సీజన్కు 3,12,688 మంది రైతులకు రూ.172.41 కోట్లు అందించినట్లు చెప్పారు. రోడ్లు, భవనాలు శాఖ ద్వారా నల్లగొండ నుంచి ముషంపల్లి-కన్నెకల్ (వయా) ధర్మాపురం వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.99.80కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 2,29,838 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.30.18కోట్లతో చేపట్టిన 15 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు రూ.34 500కోట్లతో 4 వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 2024 డిసెంబర్ నాటికి ఐదు యూనిట్లు పూర్తి చేయడానికి శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఉపాధి పథకం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.130.64 కోట్లు ఖర్చు చేసి 2,63,59 మంది కూలీలకు 88 వేల పని దినాల ఉపాధి కల్పించామని చెప్పారు. ఆసరా పింఛన్ల కింద 2,10,611 మందికి రూ.53,73,43,000 పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.292.71 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, తదితర పనులు చేపడుతున్నామని, రూ.32.65కోట్లతో దేవరకొండ, నిడమనూరులో కోర్టు భవనాలు, జడ్జి రెసిడెన్షియల్ క్వార్టర్స్, నల్లగొండలో ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్, ఆర్అండ్బీ ఆఫీస్తో పాటు మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియం మొదలైన పనులు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ రహదారుల నిర్మాణం, బ్రిడ్జి పనులు, భవనాల నిర్మాణం, రోడ్ల మరమ్మతులకు రూ.783.89 కోట్ల అంచనా వ్యయంతో 8,352 పనులు మంజూరైనట్లు చెప్పారు. నల్లగొండ మున్సిపాలిటీలో రూ.533 కోట్లు, మిర్యాలగూడలో రూ.101 కోట్లు, దేవరకొండలో రూ.56 కోట్లు, చిట్యాలలో రూ.19 కోట్లు, నందికొండలో రూ. 28కోట్లు, నకిరేకల్లో రూ.31 కోట్లు, హాలియాలో రూ.33 కోట్లు, చండూరులో రూ.52 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని ఆయా వసతి గృహాల్లో 15వేల మంది, గురుకులాల్లో 24,500 మంది ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఉచితంగా భోజన వసతితో నాణ్యమైన విద్యను పొందుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో ప్రతిభ కనబరిచిన 36 మంది అధికారులు, ఉద్యోగులతోపాటు 85 మంది పోలీసులకు కలెక్టర్ హరిచందన ప్రశంశా పత్రాలు అందచేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ చందన దీప్తి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.