రామగిరి, జూన్ 26: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఎంజీయూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, యూనివర్సిటీల అభివృద్ధి, విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ఎంజీయూలో ఇటీవల జరిగిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, దీంతో మాదిగ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంజీయూ ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, పీడీఎస్యూ నాయకులు హర్షవర్ధన్, ఎస్ఎఫ్ఐ నాయకులు కర్రెం రవికుమార్, వంశీ, విగ్నేశ్, వైష్ణవ్, సురేశ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.