నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్12(నమస్తే తెలం గాణ): అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం గతంలో కేసీఆర్ సర్కార్ వచ్చిన మాదిరిగానే ఎకరాకు పదివేల చొప్పున పంపిణీకి సిద్దమైంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పన రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో ఎకరాకు అదనంగా చెందా ల్సిన రూ.2500ల కోసం వచ్చే వానాకాలం సీజన్ వరకు రైతులు వేచి చూడక తప్పదు. మరోవైపు రైతుభరోసా పేరుతో రైతులతో పాటు కౌలుదారు లకు కూడా పెట్టుబడి సాయం అందిస్తానని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిం దే. దీంతో కౌలురైతులు కూడా మరో సీజన్ వరకు ఎదురు చూడాల్సిందే. మంగళవారం నుంచి ఎకరా లోపు విస్తీర్ణం కలిగిన కొంతమంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ మొదలైనట్లు సమచారం.
వాస్తవంగా నవంబర్లోనే యాసంగి రైతుబంధు డబ్బులను పంపిణీ చేసేందుకు అప్పటి కేసీఆర్ సర్కార్ సిద్దం కాగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసి పం పిణీని అడ్డుకున్న విషయం తెలిసిందే. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సీజన్కు ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేస్తామని కూడా రైతులను మభ్యపెట్టింది. కానీ ప్రస్తుత యాసంగి సీజన్లోనే పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అసెంబ్లీలో దీనిపై చర్చించిన అనంతరం విధి విధానాలను రూపొందించాకే వచ్చే సీజన్ నుంచి ఎకరాకు ఏడాదికి 15వేల రూపాయల పెంపు వర్తిస్తుందన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ సీజన్ నుంచే పెంపు వర్తిస్తుందని ఆశించిన రైతుల్లో నిరాశ కనిపిస్తోంది. ఇక మరోవైపు కౌలురైతులు కూడా కాంగ్రెస్ సర్కార్పై ఈ సీజన్ నుంచే ఆశలు పెట్టుకు న్నారు. తమకు కూడా ఎకరాకు రూ.7500లు వస్తాయని భావించారు. విధివిధానాలు ఖరారయ్యే వరకు వీరు వేచి చూడక తప్పని సరి పరిస్థితి.
ఎకరం రైతుల నుంచి షురూ…
గతంలో మాదిరిగానే తొలి రోజు ఎకరం విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి పెట్టుబడి సాయం షురూ అయ్యింది. మంగళవారం జిల్లాలో కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలిసింది. నేటి నుంచి ప్రతీ రోజూ ఒక్కో ఎకరం విస్తీర్ణం చొప్పున పెంచుతూ పెట్టుబడి సాయం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాకాలు చేశారు. ఇలా పాసుపుస్తకం ఉన్న ప్రతీ రైతుకు ఎప్పటిమాదిరిగానే డబ్బులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 10.50 లక్షల మంది రైతులకు 1250 కోట్ల రూపాయలు అందనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. కాగా కేసీఆర్ సర్కార్ హాయంలో 11 విడతల్లో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.11,700 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా రైతులకు అందిన విషయం తెలిసిందే.
కేసీఆర్ చూపిన బాటలోనే…
తెలంగాణలో వ్యవసాయంలో పెట్టుబడి లేక రైతులు దిగాలు చెందొద్దు అనేది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందుకే సీజన్ ఆరంభంలో ప్రతీ యేటా దీన్ని రైతులకు అందేలా పకడ్భందీగా చర్యలు చేపట్టారు. కేసీఆర్ చూపిన బాటనే అనుసరిస్తూ ఇదే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో అటూఇటూగా మార్పులు చేస్తూ రైతుభరోసా పేరుతో ప్రకటించింది. పెట్టుబడి సాయాన్ని కూడా ఏడాదికి 10వేలు ఇస్తుండగా దాన్ని 15వేలు అని ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే వ్యవసాయంలో రైతుబంధు పథకం రైతుల జీవితాలతో ఎంతలా పెనవేసుకు పోయిందో అర్దం చేసుకోవచు. కాగా 2018 వానాకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్… వరుసగా మొత్తం 11 సీజన్లల్లో క్రమం తప్పకుండా ఖచ్చి తంగా అందజేస్తూ వచ్చారు. 2018 వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందిం చడం మొదలుపెట్టారు. 2018 డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి రాగానే వానాకాలం నుంచి ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 10వేల రూపాయల సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు ఎన్నడూ రైతుబంధు ఆగలేదు. పైగా సీజన్ సీజన్కు కొత్తగా పాసుపుస్త కాలు పొందిన ప్రతీ రైతుకు సైతం పెట్టుబడి సాయం అందజేస్తూ వచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్లో సైతం నవంబర్లో ఈసీ అనుమతించి ఉంటే 12వ సారి కూడా కేసీఆర్ సారధ్యంలోనే రైతుబంధు డబ్బులు రైతులకు చేరేవి.