తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ను మంత్రి ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి మాట్లాడారు. వైద్య రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. పేదలకు మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, 134 పరీక్షలను ఉచితంగా చేస్తారని తెలిపారు. చిన్న చిన్న పరీక్షలకు సైతం ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సూర్యాపేటకు మెడికల్ కళాశాల ఏర్పాటుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని, మెడికల్ వైద్య విద్యను చేరువ చేశామని చెప్పారు.
సూర్యాపేట టౌన్, జులై 2 : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ను ఆదివారం ఆయన ప్రారంభించి అందులో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి మాట్లాడారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్య రంగంలో తెలంగాణ యావత్ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. చిన్న చిన్న పరీక్షలకు సైతం ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన టీ డయాగ్నస్టిక్స్ హబ్ సౌకర్యాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో 134 వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటి బారిన పడుతుండటాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వాటిని ముందుగానే గుర్తించేందుకు మామోగ్రఫీ టెస్టులను కూడా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పల్లె, బస్తీ దవాఖానలు, పీహెచ్సీల్లోని వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పేదలతోపాటు మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడంతోపాటు అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉండేలా డయాగ్నస్టిక్స్ హబ్లను ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండానే టీ డయాగ్నస్టిక్స్ హబ్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అనారోగ్యం పాలైన వారు తమకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్స్ ఇస్తే సరిపోతుందన్నారు.
ఈ శాంపిళ్లను మొబైల్ వాహనాల ద్వారా జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్కు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేస్తారని చెప్పారు. అంతేకాకుండా పరీక్షలు నిర్వహించిన వెంటనే నేరుగా వారి ఫోన్కు రిపోర్ట్ మెసేజ్ వస్తుందన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారదాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గండూరి కృపాకర్, బైరు వెంకన్న, కక్కిరేణి నాగయ్య గౌడ్, రాపర్తి శ్రీనివాస్, శబరి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.