నేరేడుచర్ల, అక్టోబర్ 30 : గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాల్లో సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరానున్నారు.
హుజూర్నగర్లో
హుజూర్నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ సమీపంలోని గ్రీన్వుడ్ స్కూల్ వద్ద గల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన సభలో సుమారు 70వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉప ఎన్నికలో గెలిచాక సీఎం కేసీఆర్ హాజరైన కృతజ్ఞత సభ, నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన సమయంలో ఇదే స్థలంలో సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, జర్నలిస్టులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేలా బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు వాహనాల రాకపోకలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సభ ప్రాంగణానికి నాలుగు దిక్కులా వాహనాలు ఆపేందుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు మొత్తం 390మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. డీఎస్పీలు-3, సీఐలు-8మంది, ఎస్ఐలు -29మంది, ఏఎస్ఐల, హెడ్ కానిస్టేబుళ్లు- 89 మంది, పోలీసులు, హోంగార్డులు- 242 మంది నియమించి పర్యవేక్షించనున్నారు. దానికి అనుగుణంగా కావాల్సిన సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కోదాడ డీఎస్పీ ప్రకాశ్ యాదవ్, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డిఫ చర్యలు తీసుకుంటున్నారు.
నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల నుంచి వచ్చే వాహనాలను పట్టణంలోని వాసవీ భవన్ సమీపంలోని ఖాళీ స్థలంలో, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం నుంచి వచ్చే వాహనాలు వీకే వెంచర్లో నిలిపివేయనున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా ప్రాంగణానికి సమీపంలోనే పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
హుజూర్నగర్లో మంగళవారం మధ్యాహ్నం 12: 30 గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నందున నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. సభలో నియోజకవర్గ అభివృద్ధి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సీఎం కేసీఆర్ వివరించనున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి చేరే వరకు అందరూ జాగ్రత్తగా వచ్చి వెళ్లాలని సూచించారు.
– హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి