రక్షాబంధన్ రోజున మహిళా సంఘాల సహాయకులకు(వీఓఏ) సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. ప్రస్తుతం వీఓఏలకు రూ.5వేల వేతనం వస్తుండగా, రూ.8వేలకు పెంచారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలకు చేదోడుగా ఉంటూ ఆర్థిక, ఇతర అంశాల్లో సహకారం అందిస్తున్న వీఓఏలకు తక్కువ వేతనం వస్తుందనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రెస్ కోడ్ అమలుకు సైతం నిధులు కేటాయించారు. జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు విధివిధానాలు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 2,220 మంది వీఓఏలు ఉండగా, ముఖ్యమంత్రి నిర్ణయంతో పండుగ పూట ఆయా కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది.
– నల్లగొండ, ఆగస్టు 31
నల్లగొండ, ఆగస్టు 31 : గ్రామాల్లో పొదుపు సంఘాలు ఏర్పడిన సమయంలో వారికి సహాయకులు అవసరం అనే ఆలోచనతో ప్రభుత్వం వీఓఏలను నియమించింది. వారికి నెలవారీగా నిర్ణీత వేతనం అనేది ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా ఆయా పొదుపు సంఘాల నుంచే రూ.2 వేలు తీసుకోవాలని సూచించి వదిలేసింది. అయితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత తొలిసారిగా 2016లో రూ.3 వేల వేతనం ఇచ్చి, పొదుపు సంఘాల నుంచి రూ.2 వేలు తీసుకోమని చెప్పి మొత్తం రూ.5 వేలు అందేలా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత పెంచిన పీఆర్సీకి అనుగుణంగా రూ.3 వేల వేతనానికి మరో రూ.900 కలిపి ప్రతి నెల రూ.3,900 ఇస్తూ, రూ.2 వేలను సంఘాల నుంచి తీసుకోమని చెప్పడంతో ఇప్పటి వరకు అదే అమలు అ వుతూ వస్తున్నది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాఖీ పర్వదినం రోజున మహిళా సంఘాలకు శుభవార్త చెబుతూ రూ.3,900కి రూ.1,100 కలిపి ఆయా సంఘాలకు వచ్చే లాభాల నుంచి మరో రూ.3 వేలు అంటే మొత్తంగా నెలకు రూ.8 వేలు అందేలా నిర్ణయం తీసుకుని వారికి శుభవార్త చెప్పింది.
నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 28,508 సంఘాలు ఉండగా ఆయా సంఘాల్లో 1,94,149 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఆయా సంఘాల ఆర్థిక లావాదేవీల నిర్వహణకు 1,104 మంది వీఓఏలు ఉండగా తాజా ప్రభుత్వ నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరనున్నది. సూర్యాపేట జిల్లాలో 17,459 సంఘాలు ఉండగా 1,81,403 మంది సభ్యులు ఉన్నారు. 570 మంది వీఓఏలు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 14,842 సంఘాలు ఉండగా 1,55,234 మంది సభ్యులు ఉన్నారు. 546 మంది వీఓఏలు ఉన్నారు. ప్రస్తుతం వారికి నెలకు సంఘాల నుంచి తీసుకునే డబ్బులతో కలిపి రూ.5,900 అందుతుండగా తాజాగా పెంచిన వేతనంతో నెలకు రూ.8 వేలు అందనున్నది. ఇప్పటి వరకు వీఓఏలకు వేతన రూపంలో సర్కార్ నెలకు రూ.65,13,600 ఇస్తుండగా ఇక నుంచి పెంచిన వేతనంతో రూ.88,32,000 వేలు అందనున్నది.
వేతన పెంపుపై వీఓఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీఓఏలకు డ్రెస్ కోడ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. జీవితా బీమా కోసం వెంటనే విధి విధానాలు సిద్ధం చేసి నివేదించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రభుత్వం వీఓఏల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వేతనం పెంచడం సంతోషం. గత పాలకులు ఎలాంటి వేతనం ఇవ్వకుండా సంఘాల నుంచి మాత్రమే రూ.2 వేలు తీసుకోమని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం రూ.3 వేల వేతనం ఇచ్చింది. ఇటీవల 30 శాతం పీఆర్సీ సైతం అమలు చేసింది. ఇప్పుడు మొత్తంగా రూ.8 వేలు అందేలా జీఓ విడుదల చేయడం సంతోషం. వీఓఏలు సీఎం కేసీఆర్ మేలును మర్చిపోలేరు. అంతేకాకుండా డ్రెస్ కోడ్కు నిధులు కేటాయించడం సంతోషం. ఇక జీవితా బీమా కూడా అమలు చేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది.
– దొనకొండ రవికుమార్, వీఓఏల జేఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్, నల్లగొండ