భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామం, పట్టణం నుంచి సామాన్య ప్రజలు స్వచ్ఛదంగా తరలి వచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో భువనగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రజల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానున్న తరుణంలో ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్ కోసం భువనగిరి ప్రాం త ప్రజలు ఎదురుచూస్తున్నారు. సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి పర్యవేక్షించారు. అదేవిధంగా సభకు సంబంధించి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చర్యలు చేపట్టేందుకు అనుగుణంగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సభాస్థలిని పరిశీలించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా ఆశీర్వాద సభకు 60వేలకు పైగా జన సమీకరణ చేపట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలో ప్రతి గ్రామం, పట్టణాలకు ప్రత్యేకంగా ఇన్చార్జులను నియమించారు. సీఎం కేసీఆర్ రానున్న సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు పూర్తిగా గులాబీమయంగా మారనున్నాయి.
ప్రజా ఆశీర్వాద సభపై ప్రజల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ఏం ప్రసంగం చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన భువనగిరి ప్రాంతం సీఎం కేసీఆర్కు, తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన నేపథ్యంలో నేడు జరిగే ప్రజా ఆశీర్వాద సభ ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పరిశీలించారు. సభాస్థలిలో కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభాస్థలిలోని ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది.