యాదాద్రి భువనగిరి, జనవరి 17(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆవిర్భావసభ బుధవారం ఖమ్మంలో జరుగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నారు. ఖమ్మం పర్యటన కంటే ముందు వీరంతా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 11.30 గంటలకు గుట్టలో టెంపుల్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డితోపాటు అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం వెంట గుట్టపైకి చేరుకుంటారు. కొండపైకి నలుగురు సీఎంలతోపాటు, మాజీ సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలుకుతారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారికి అర్చకులు వేదమత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేయనున్నారు. ఆ తర్వాత వారికి తీర్థప్రసాదాలు అందించనున్నారు. ఈ సందర్భంగా గుట్ట పునర్నిర్మాణంపై కేసీఆర్ వివరించనున్నారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి హెలీకాప్టర్లలో ఖమ్మం బయల్దేరి వెళ్లనున్నారు.
అధికారుల ఏర్పాట్లు పూర్తి
యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రుల రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సమీక్షించారు. టెంపుల్ సిటీ వద్ద హెలీ ప్యాడ్ను సిద్ధం చేశారు. హెలీకాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. అదే విధంగా టెంపుల్ సిటీ నుంచి కొండపైకి కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రులకు ఘన స్వాగతం చెప్పేందుకు అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
1600 మందితో భారీ బందోబస్తు..
నలుగురు సీఎంల పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1600మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇందులో డీసీపీ, ఏసీపీ, సీఐలు, ఎస్లు ఉన్నారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం గుండా గుట్టపైకి చేరుకోనుండటంతో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. బాంబ్ స్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇప్పటికే సీపీ చౌహాన్ హెలీప్యాడ్, మాఢవీధులు, ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఒంటి గంట వరకు దర్శనాలు రద్దు..
నలుగురు సీఎంల పర్యటన నేపథ్యంలో ఆల య అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ సమయంలో భక్తులు, వాహనాలను గుట్టపైకి అనుమతించబోమని ఈఓ గీతారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులు గుట్టపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. భక్తులంతా సహకరించాలని కోరారు.
సీఎంల టూర్ ఇలా..
* ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రెండు హెలీకాప్టర్లలో పయనం
* 11.30 గంటలకు యాదగిరిగుట్ట హెలీప్యాడ్ వద్దకు రాక
* 12.30 గంటలకు యాదగిరిగుట్ట నుంచి ఖమ్మం బహిరంగసభకు పయనం