రాజాపేట, నవంబర్ 25 : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో బీజేపీ నాయకుల ఒంట్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. మోదీ ఎనిమిదేండ్ల పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కి అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారన్నారు. దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు 8రాష్ట్రాల ప్రభుత్వాలను దొడ్డి దారిన కూల్చేసి అధికారాన్ని చేజికించుకున్నారన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని కుట్రలు, కుతంత్రాలను ఇక్కడ సాగనివ్వరని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఈడీ, ఐడీ దాడులు చేస్తే భయపడే ప్రసక్తే లేదని తెల్చి చెప్పారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని గ్రామాల్లోకి వస్తున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్య క్షుడు నాగిర్తి రాజిరెడ్డి, నాయకులు మోత్కూపల్లి ప్రవీణ్, తిరుమలేశ్, భాస్కర్, నరేశ్రెడ్డి, ప్రమోద్సింగ్, వీరేశం, తిరుపతిరెడ్డి, రాములునాయక్, కిషన్, సాయి, చంద్రయ్య పాల్గొన్నారు.