హాలియా, మే 26 : తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ దశ, దిశను మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా క్యాంప్ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22 వరకు నియోజకవర్గంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి రంగంలో సాధించిన ప్రగతిని 21 రోజుల పాటు రోజుకో రంగం చొప్పున ప్రజలకు వివరిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. జూన్ 22న తెలంగాణ అమర వీరులకు నివాళులర్పరణతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. దశాబ్ధి ఉత్సవాల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు..
గతంలో మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది రబీలో నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతాంగం నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గతేడాది రబీలో 38 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 1లక్షా 25వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, హాలియా, నిడమనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి, అనుముల, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండల శాఖ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, సత్యపాల్, రవినాయక్, పిడిగం నాగయ్య, హాలియా పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, హాలియా మార్కెట్ వైస్ చైర్మన్ రామలింగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యడవల్లి మహేందర్రెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నోముల విజ్ఞప్తికి మంత్రి ;హరీశ్ సానుకూల స్పందన
హాలియా/గుర్రంపోడు : మిర్యాలగూడెం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ మిర్యాలగూడెంలో కలిశారు. ఈ సందర్భంగా నిడమనూరు మండలం తుమ్మడంలో హెల్త్ ఆఫ్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజవరంలో పీహెచ్సీ సబ్ సెంటర్ ఏర్పాటుకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ డిప్యూటేషన్పై వెళ్లిన 8 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని తిరిగి రప్పించాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి తక్షణమే స్పందించిన మంత్రి గుర్రంపోడు వైద్య ఆరోగ్య సిబ్బంది డిప్యూటేషన్ను రద్దు చేయడంతో పాటు, తుమ్మడం, రాజవరం, తిరుమలగిరి సాగర్లో వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.