సూర్యాపేట, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి జిల్లా అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల కృషి తోనే దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందన్నారు. చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఉందని, అందుకు ఉద్యోగులు మరింతగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇంత అభివృద్ధి జరిగిందంటే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉందని, ఈ కీర్తి వారికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అమెరికా నుంచి తేలేదని, పాత వారితోనే ఇలాంటి అద్భుతం చేయించామన్నారు. జట్టుకట్టి పట్టుబడి చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించినట్లు చెప్పారు. పనిమంతులు, బద్ధిమంతులు, ప్రగతికాముకులు విశ్రాంతి తీసుకోవద్దని, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని చూసి సంతోషపడి రికాల్స్ కావొద్దన్నారు. ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని, సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గిపోయి ప్రజలంతా సంతోషంగా, గర్వంగా బతికే వరకు పని చేయాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మానవాభివృద్ధి సూచికలో దేశంలోనే పెద్ద రాష్ర్టాల కంటే తెలంగాణ నంబర్వన్లో ఉందని, అందుకు మనమంతా గర్వపడాలన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ప్లేస్లో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా బతుకుతున్నారని, ఎక్కడా ఆకలిచావులు లేవని, పస్తులు ఉండేవారు లేరని చెప్పడానికి సంతోషంగా ఉందని చెప్పారు. జీరో ఫ్లోరోసిస్ స్థాయికి తెలంగాణ వచ్చిందని కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇందులో మిత్రుడు దుశ్చర్ల సత్యనారాయణ కృషి ఎంతో ఉందని చెప్పారు. మిషన్ భగీరథతో తెలంగాణలో ఫ్లోరోసిస్ను తరిమివేశామన్నారు. ఈ ఘనత ముమ్మాటికీ మిషన్ భగీథర ఉద్యోగులకు దక్కుతుందన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. సూర్యాపేట జిల్లాగా ఏర్పాటు కావడమే ఒక చరిత్ర అన్నారు. ఇక్కడి మెడికల్ కళాశాల విద్యార్థులను చూస్తే పండుగ వాతావరణం కనిపించిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడమే కాకుండా నూతనంగా పరిపాలనా భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ను చైర్లో కూర్చోబెట్టి..
సీఎం కేసీఆర్ సాయంత్రం 4.10 గంటలకు కుడకుడలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ప్రారంభించి కలెక్టరేట్ డోర్ వద్ద రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం 4.20 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4.26 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ను కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకంక్షలు తెలిపారు. కలెక్టర్ ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించారు. కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి కేసీర్కు భోజనం ఏర్పాటు చేశారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం జిల్లా అధికారులు సీఎం కేసీఆర్తో గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బహిరంగ సభకు బయల్దేరారు.