‘గొంగిడి సునీతాహేందర్ రెడ్డి నా సొంత బిడ్డలాంటిది. ఉద్యమం నుంచి నా వెంటే ఉండి కొట్లాడింది. ఆలేరు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ సభను చూస్తేనే సునీతమ్మ మరోమారు గెలుపు ఖాయమని అర్థమవుతున్నది. ఆమె నా ముందు పెట్టిన డిమాండ్లన్నీ తప్పకుండా అమలు చేస్తాం.. ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం సునీతమ్మను ఆశీర్వదించండి. యాదగిరిగుట్ట ఆలయ శిఖరం ఎంతెత్తు ఉందో.. అంతెత్తు ఓట్లతో గెలిపించాలి’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఆదివారం ఆలేరు పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు కరువు కాటకాలతో దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నదని, తాగు, సాగు నీరు లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డారని గుర్తు చేశారు. సునీతమ్మ ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. బీఆర్ఎస్ సర్కారులో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఇల వైకుంఠంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ‘గొంగిడి సునీతమ్మ 2001 నుంచి నా వెంట నడిచింది. గులాబీ జెండాను మోసింది. జడ్పీటీసీగా గెలిచింది. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యింది. సునీత నాకు సొంత బిడ్డ. ఆమె ఏదీ అడిగినా నేను కాదనలేదు. ఆమె అడిగిన డిమాండ్లన్నీ నెరవేరుస్తా. మీ ఎమ్మెల్యేను మూడోసారి గెలిపించండి. ఆలేరు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి.’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఆలేరులో నాడు రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, పడినా కరెంట్ లేక ఎన్నో గోసలు పడ్డారని సీఎం గుర్తు చేశారు. పశువులకు గడ్డి కూడా దొరికేదికాదన్నారు. పటాకులు పేలినట్లు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని గుర్తుచేశారు. అలాంటి ఆలేరు ఇప్పుడు సస్యశ్యామలమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆలేరు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. సునీతమ్మ 29 చెక్డ్యామ్లను కట్టించిందని చెప్పారు. వీటితో భూగర్భజలాలు బాగా పెరిగాయన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో గుట్టను పట్టించుకున్న నాథుడేలేరన్నారు. ఒకప్పుడు ఆలేరు భూములకు విలువ ఉండేది కాదని, ఇప్పుడు నియోజకవర్గానికి పెద్దపెద్ద షావుకార్లు వచ్చి భూములు కొన్నారని వివరించారు. ఉమ్మడి పాలనలో ఆలేరు నుంచి రైళ్లలో హైదరాబాద్కు ఉపాధి కోసం వెళ్లేవారని, ఇప్పుడు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఆలోచనలతో ఓటు వేయాలని సూచించారు. 24 గంటల కరెంట్ కావాలంటే సునీతామహేందర్రెడ్డిని గెలిపించాలన్నారు.
‘మల్లన్నసాగర్ ఆలేరు నెత్తిమీదనే ఉంది. బస్వాపూర్ రిజర్వాయర్, గంధమల్ల నిండుగా ఉంటాయి. నాలుగైదు నెలల్లో బస్వాపూర్ను నింపుతాం. బస్వాపూర్ రిజర్వాయర్ నీటితో త్వరలోనే ఆలేరు సస్యశ్యామలం కాబోతున్నది. గంధమల్ల ఎండాకాలంలోనూ మత్తళ్లు తొక్కుతున్నయి. అశ్వరావుపల్లి కాల్వ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. రైతులకు నీటిని అందించేందుకు మరో 20 నుంచి 30 చెక్ డ్యామ్లు కట్టించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు నియోజకవర్గంలో 27వేల ఎకరాల్లో సాగు జరిగితే.. నేడు 2.16 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. దీనికి సునీతమ్మే కారణం’ అని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్కు బంగారు రాజకీయ భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇద్దరు కలిసి ఆలేరు అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి, సీహెచ్ దినేశ్, బొంతు రామ్మోహన్, పిచ్చిరెడ్డి, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి తన అనుచరుడు సతీశ్భట్తో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రధాన అనుచరులు తుర్కపల్లి మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్గౌడ్, యాదగిరిగుట్ట గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్గౌడ్ బీఆర్ఎస్లో చేరారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎడారిగా ఉన్న ఆలేరును సస్యశ్యామలం చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చి దేవుడయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచమే గుర్తించేలా పునర్నిర్మించారు. ఏమిచ్చి మీ రుణం తీసుకోవాలి సార్.. మా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేం సార్’ అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. మీ దయతో ఆలేరును ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నవాబ్పేట రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ ప్రధాన కాల్వలతో నియోజకవర్గానికి సాగుజలాలు వచ్చాయని తెలిపారు. 2014 కంటే ముందు నియోజకవర్గంలో కేవలం 25 వేల ఎకరాల మాత్రమే సాగయ్యేదని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2.16లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చిందన్నారు.
వలస వెళ్లిన రైతులు తిరిగి గ్రామాలకు వచ్చి సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. 39 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకున్నామన్నారు. నియోజకవర్గంలోని శామీర్పేట, పెద్దకందుకూరు, చొల్లేరు, బిక్కేరు వాగులపై 29 చెక్డ్యామ్లు నిర్మించామన్నారు. యాదగిరిగుట్టలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాజాపేట మండలం రఘునాథపురం, తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం)లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గంలో 12 వేల మంది దళితులకు దళితబంధు మంజూరు చేశామని, ఇంకా 13,560 మందికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జై బీఆర్ఎస్.. జయహో ఆలేరు అంటూ ఆలేరు నియోజకవర్గ ప్రజానీకం కదంతొక్కారు. నింగిని
తాకే అభిమానం, నూతనోత్సాహంతో గులాబీ దండు కదిలింది. భారీగా తరలివచ్చిన జనంతో ఆలేరు ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్పై విరుచుకుపడటం, ఆలేరుకు వరాలు కురిపించడంతో సభా ప్రాంగణమంతా జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీతమ్మ అంటూ నినాదాలు, కేరింతలతో మార్మోగింది.
సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ధూంధాం పాటలు ఉర్రూతలూగించాయి. ప్రముఖ జానపద గాయకుడు ఏపూరి సోమన్న, సింగర్ యాట కవిత బృందం ఆటపాటలకు అంతా ముగ్దులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడుతూ అలరింపజేశారు.
ఆలేరు ఆశీర్వాద సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ రాజేశ్చంద్ర, ఏసీపీ శివరామిరెడ్డి, సీఐ సురేందర్రెడ్డి నేతృత్వంలో 750 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఒకరోజు ముందుగానే పోలీసులు సభాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
దారులన్నీ ఆలేరు సభ వైపే సాగాయి. పల్లెలు, పట్టణాలు, మారుమూల తండాల నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా సీఎం కేసీఆర్ సభకు కనీవిని ఎరుగని రీతిలో జనం తరలివచ్చారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రైతులు, మహిళలు, యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 80 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తున్నది. సభకు మహిళలు అధికంగా రావడంతోపాటు యువత కేరింతలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దిశానిర్దేశంతో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కార్లు, బైక్లు, ట్రాక్టర్లు, డీసీఎం వాహనాల్లో సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
ప్రజా ఆశీర్వాద సభతో ఆలేరు పట్టణం గులాబీమయంగా మారింది. ఎటుచూసినా సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కటౌట్లు దర్శనమిచ్చాయి. అడుగడుగునా బీఆర్ఎస్ జెండాలు, కారు గుర్తులు, ఫ్లెక్సీలు కనిపించాయి. సభలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ఆకట్టుకున్నాయి. గులాబీ టోపీలు, కండువాలతో జనం తరలివచ్చారు. దాంతో ప్రాంతమంతా గులాబీ వనంలా మారింది.