ముఖ్యమంత్రి కేసీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల భూములకు రక్షణ కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు నిశ్చింతగా ఉన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి, పాత విధానాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోతే మా భూములకు రక్షణ ఉండదని, వివరాలు తారుమారవుతాయని ఆందోళన చెందుతున్నారు. కౌలుదారు కాలమ్ గొడవలకు దారి తీస్తుందని మండిపడుతున్నారు. అవినీతికి ఆస్కారముండే పటేల్, పట్వారీ వ్యవస్థ మాకొద్దని తెగేసి చెప్తున్నారు. ధరణి పోర్టల్ జోలికొస్తే కాంగ్రెస్కు పాతరేస్తామని హెచ్చరిస్తున్నారు.
ధరణిని తీసేస్తే దళారుల రాజ్యం వస్తది. అవినీతి పెరుగుతుంది. రైతులకు అన్నీ కష్టాలే వస్తాయి. రైతుల భూముల బాధలు పోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్వారీ వ్యవస్థను తీసేసి ధరణి తీసుకొచ్చిండు. మళ్లీ పట్వారీలు వస్తే రైతుల భూ సమస్యలు మొదటికి వస్తాయి. కౌలుదారులకు కాస్తు కాలంలో అవకాశం ఇస్తే భూ యజమానికి, కౌలుదారులకు కొట్లాటలు తప్పవు. రైతుల సమస్యలు ఎనుకటిలాగే ఉంటాయి. రైతులు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. లంచాలు లేనిదే పని జరుగదు. అందుకే రైతులంతా ఒక్కటై కేసీఆర్ను గెలిపించుకుంటే రైతు బంధు, రైతు బీమా వస్తాయి. భూ సమస్యలు ఉండవు.
– స్వామినాయక్, రైతు, తిరుమలగిరి
ధరణి అమలు చేయడంతో ఎంతో మంది రైతులు తమ పొలాలను తమ వారసులకు తక్కువ సమయంలో మార్పిడి చేసుకున్నారు. ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏర్పడిన దళారీ వ్యవస్థ రూపుమాసిపోయింది. అటువంటి ధరణిని తీసేసి తిరిగి దళారీ వ్యవస్థకు ప్రాణం పోసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలుస్తారు.
– బట్టు పూర్ణచందర్రావు, రైతు, నల్లబండగూడెం (కోదాడ రూరల్)
ధరణి రాకముందు భూమి అమ్ముదామన్నా.. కొందామన్నా తీవ్ర ఇబ్బందులు ఉండేటివి. ధరణి వచ్చినంక ఆ సమస్యలు లేవు. భూమి అమ్మితే నిమిషంలోనే పని అవుతున్నది. కొన్నా అంతే టైం పడుతుంది. గతంలో భూమి అమ్మినా.. కొన్నా నెలల తరబడి తిరిగినా పాసు పుస్తకాల్లో మార్పులు జరుగలేదు. అంతేకాకుండా లంచం ఇవ్వకుండా పనులు జరిగేవి కావు. ఇప్పుడు భూమి అమ్మితే అప్పటికప్పుడే పట్టాలో వారి పేర్ల స్థానంలో కొన్నవారి పేర్లు వస్తుండటంతో అవకతవకలు జరుగడం లేదు. ఇదంతా ధరణి మూలంగానే అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నది. ధరణి పోతే దరిద్రం కొనితెచ్చుకున్నట్లే. ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెస్ నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం. కేసీఆర్ను మరోసారి సీఎంగా చూడాలనేది రైతుల లక్ష్యం.
– రవీందర్, పులగంబండ తండా, నేరేడుచర్ల మండలం
సీఎం కేసీఆర్కు రైతుల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నది. వ్యవసాయ భూములను ధరణిలో పొందుపర్చడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. తమ భూములకు భద్రత ఉంటుంది. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ, వీఆర్వో వ్యవస్థలు ఉన్న సమయంలో రికార్డుల్లో చాలా అవకతవకలు జరిగేవి. వాటిని సరి చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగేది. రకరకాల వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ధరణి పోర్టల్ తీసుకురావడంతో ఆ సమస్యలన్నీ పోయాయి. కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేసి మళ్లీ పాత వ్యవస్థలను తీసుకురావాలని చూడడం మంచిది కాదు. ధరణిని ఎత్తేస్తే తిరిగి దళారుల రాజ్యం వచ్చే అవకాశం ఉన్నది. రైతులు ఇబ్బందుల పాలవుతారు.
– కందుల వెంకన్న, రైతు, కందిబండ, మేళ్లచెర్వు మండలం
గతంలో రైతులు తమ భూములు తన పేరుపైనే ఉన్నాయా? అని అప్పుడప్పుడు చూసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పట్లో కొంతమంది అధికారులు పైసలిస్తే ఏ పనైనా చేసేవారు. దీంతో రైతులు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ బాధలను తొలగించాలనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత రైతులు చింత లేకుండా వ్యవసాయ పనులు హాయిగా చేసుకుంటున్నారు. ధరణిలో రైతుల భూముల వివరాలు నమోదైన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు. భూమి పట్టా మార్పిడి చేయాలంటే సదరు రైతు వేలిముద్ర వేయాల్సిందే. కానీ.. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారు.
అనుభవదారు కాలం పెడతామంటే మళ్లీ ఎనుకటి రోజుల్లోకి వెళ్లబోతున్నాం. అంటే చేయి తడపందే పనులు సాగని పరిస్థితి వస్తుందన్నమాట. గతంలో భూమిని కొనుగోలు చేసిన రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రోజంతా వెచ్చించి కొందరికి డబ్బులు ముట్టజెప్పితే కానీ పని అయ్యేది. అక్కడ డాక్యుమెంట్లు తెచ్చి తాసీల్దార్ కార్యాలయానికి నెలల తరబడి తిరిగి ముడుపులు అందిస్తే కానీ భూమి మన పేరుపైకి మారేది. ధరణి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి పోయి 15 నిమిషాల్లోనే పని పూర్తి కావడంతోపాటు ఆన్లైన్లో కూడా నమోదవుతుంది. పైగా ఎవరికీ పైసా ఇవ్వన్నక్కర్లేదు. ఇంత మంచి పోర్టల్ను తీసేస్తామనడం కాంగ్రెస్ నాయకుల అవివేకం. కాబట్టి రైతులు ఎవరికి ఓటెయ్యాలో ఆలోచించాలి.
– పడిగపాటి నర్సింహారెడ్డి, రైతు, పరెడ్డిగూడెం, గరిడేపల్లి మండలం