యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానన్నారు. రెండు హబ్లతో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయని, మరోసారి అధికారంలోకి రాగానే తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. త్వరలోనే సాగు నీరు అందిస్తామని, తద్వారా లక్ష ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన తర్వాత అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు. నాడు కరువుతో ఉన్న భువనగిరిలో ఇవ్వాల అద్భుతమైన పంటలు పండిస్తున్నారని చెప్పారు. ఇక్కడ కాల్వలు, గోదావరి జలాలు రావాలని ఎన్నో కలలు కన్నామని, కాల్వల పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ఘట్కేసర్ దాటితే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి జిల్లా భవిష్యత్లో బంగారు తునక అవుతుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో భువనగిరిలో అశాంతి ఉండేదని, ఆ పార్టీ అరాచక శక్తులు, మూకల సామ్రాజ్యాన్ని పెంచిపోషించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎంతో గోస పడ్డారని గుర్తు చేశారు. అలాంటి అరాచక, కిరాతక వాదులను బీఆర్ఎస్ ఏరి పారేసిందని, ఇప్పుడు భువనగిరి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావద్దని, వాస్తవమేంటో గుర్తించాలని, మంచిచెడులను ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ధరణి పోతే మళ్లీ రైతులకు కొట్లాటలు, అవినీతి, అరాచకత్వం వస్తుందన్నారు. కాంగ్రెస్తో పెద్ద ప్రమాదం ఉందని, పైరవీ కారుల హస్తం పార్టీని రానివ్వొద్దని పిలుపునిచ్చారు. మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్కు కరెంట్ షాక్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు.
జిల్లాకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాకపోతే యాదాద్రి కొత్త జిల్లా ఏర్పాటయ్యేది కాదన్నారు. ప్రజల పోరాట ఫలితంగానే జిల్లా సాధ్యమైందన్నారు. కొత్త కలెక్టరేట్ను ప్రారంభించుకున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. గుట్టలో భూముల విలువ అమాంతం పెరిగిందని, కోట్లల్లో పలుకుతున్నాయని తెలిపారు.
ఎమ్మెల్యే శేఖర్రెడ్డి భువనగిరిని అద్భుతంగా అభివృద్ధి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన్ను వరుస విజయాలు వరిస్తున్నాయని పేర్కొన్నారు. భువనగిరిలో మళ్లీ గెలిచేది శేఖర్రెడ్డినే అని అన్నారు. తన సర్వే ప్రకారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని స్పష్టం చేశారు. పైళ్లను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించి దీవించాలని పిలుపునిచ్చారు. అందరికీ సన్నబియ్యం, 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉమామాధవరెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, చాడ కిషన్రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతుబంధు సమితి చైర్మన్ కొలుపుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.