చారకొండ, ఆగస్టు 7 : అధికారుల తీరుపై నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములను గుంజుకోవడానికి అధికారులు తమకు తెలియకుండానే సర్వే చేస్తున్నారని, అదీగాక హద్దురాళ్లు కూడా పాతుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం తిమ్మాయిపల్లి శివారులో వ్యవసాయ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం డ్రోన్ కెమెరాలతో తమ భూములను సర్వే చేశారని, తమకు తెలియకుండానే హద్దు రాళ్లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎందుకు సర్వే చేస్తున్నారని అధికారులను అడిగితే రోడ్డు అని ఒకరు, తమకు తెలియదని మరొకరు పొంతన లేని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, వ్యవసాయంపై ఆధారం పడి జీవిస్తున్నామని ప్రభుత్వం తమ భూములను రోడ్డు, ప్రాజెక్టు, పరిశ్రమల పేరుతో లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎందుకోసం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారో వెంటనే అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని రైతులు హెచ్చరించారు.