రైతులు పంట పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు అందించారు. ఆ తర్వాత దానిని ఎకరాకు రూ.5వేలకు పెంచారు. నల్లగొండ జిల్లాలో నాడు 3,70,434 మందికి రైతుబంధు అందగా ప్రస్తుతం 5,32,434 మందికి వస్తున్నది. పెట్టుబడి సాయం రూ.418.70 కోట్ల నుంచి రూ.623.59 కోట్లకు పెరిగింది. ఇదే పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున అందిస్తున్నది. నాడు ఈ పథకంలో 2,70,763 మంది రైతులు ఉండగా ప్రస్తుతం 2,32,419 మందికి తగ్గారు. ఇప్పటివరకు రైతులకు అందిన సాయం రూ.1950 కోట్లు మాత్రమే. వివిధ కారణాలు చూపుతూ కేంద్రం ఈ పథకానికి రైతులను దూరం చేస్తున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల నుంచి ప్రతి సీజన్లో దరఖాస్తులు తీసుకుంటూ సాయం చేస్తుండగా మోదీ సర్కారు తిరోగమనం దిశగా వెళ్తున్నది.
– నల్లగొండ, జూలై 28
నల్లగొండ, జూలై 28 : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధును కాపీ కొట్టి కేంద్రం అమలు చేస్తున్న పథకం ఇది. 2019 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన ఈ పథకం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఏడాదికి మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అందజేస్తున్నా ఈ పథకం కింద జిల్లాలో మొదట 2,70,763 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా తొలి విడుతలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున రూ.54.15 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఏటా మూడు దఫాలుగా ఇప్పటి వరకు 13 సార్లు పెట్టుబడి సాయం అందజేసింది. ఈ నెల 28 (శుక్రవారం)న 14వ సారి రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ సారి మాత్రం రైతుల సంఖ్య కాస్త తిరోగమనం దిశగా వచ్చి 2,32,419 మందికి దిగజారింది. అయితే ఈ దఫా కేంద్ర ప్రభుత్వం నుంచి అందే పెట్టుబడి సాయం మాత్రం అదే రెండు వేల లెక్కన రూ.46.48 కోట్లు మాత్రమే. అంటే మొదటి దఫాకి 14 దఫాకు రైతుల సంఖ్య సుమారు 40 వేల దాక తగ్గడంతో సాయం రూ.7.67 కోట్లు తగ్గింది. ఈ 13 దఫాలుగా కేంద్రం జిల్లా రైతాంగానికి ఈ పథకం కింద ఇప్పటికీ వరకు రూ.1,950 కోట్లు అందజేసింది.
కుంటి సాకులతో కోత
2019లో 2.70 లక్షల మందికి పథకం వర్తింప జేయగా ప్రస్తుతం ఆ సంఖ్య 2.32 లక్షలకు చేరింది. అనేక కారణాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల సంఖ్య కుదిస్తూ వస్తున్నది. రైతులు తమ భూమిని తిరిగి ఎవరికైనా విక్రయిస్తే ఆ రైతు పేరు తొలిగిస్తున్నది. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతు పేరు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక ఈ పథకం కింద సాయం పొందుతున్న రైతులు ఆదాయ పన్ను చెల్లించినా, మరణించినా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, పీఎం కిసాన్ నిధి పథకంలో ఆటోమేటిక్ గా పేరు తొలగిపోతున్నది. దీనికి ప్రామాణికం ఆధార్ కార్డు. దీని ద్వారా ఎప్పటికప్పుడు వెరీ ఫై చేసి సాయం పొందే రైతుల పేర్లు తొలగిస్తున్న క్రమంలో ఈ మూడేండ్ల కాలంలో జిల్లాలో సుమారు 40 వేల మంది రైతుల పేర్లు ఈ పథకం నుంచి తొలగించపడ్డాయి. అసలు విషయం ఏంటంటే ఈ పథకం మొదలు పెట్టినప్పుడు పెట్టుబడి సాయం కోసం రైతుల కోసం దరఖాస్తులు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సారి కూడా మరో సారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్న పేర్లు తొలగిస్తుండడంతో ఈ పథకం తిరోగమనం దిశగా వెళ్తున్నది.
రైతు బంధులో పెరుగుతున్న రైతుల సంఖ్య.. పెట్టుబడి సాయం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధులో మాత్రం ప్రతి సీజన్లో రైతుల సంఖ్యతో పాటు పెట్టుబడి సాయం కూడా పెరుగుతూనే ఉంది. ఆరంభంలో పట్టా భూములన్నింటికీ రైతు బంధు ఇచ్చిన సర్కార్ క్రమంగా ఆర్ఓఎఫ్ఆర్, పోడు భూములకు సైతం ఇస్తుండడంతో ఈ సాయం క్రమంగా పెరుగుతున్నది. 2018 రైతు బంధు ప్రారంభించగా తొలి దఫా జిల్లాలో 3,70,34 మందికి రూ.418.70 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం ఈ వానకాలం సీజన్లో(11వ దఫా)5,32,434 మంది రైతులకు రూ.623.59 కోట్లు అందజేస్తున్నది. అంటే ఈ పథకం ప్రారంభించిన ఈ ఐదేండ్లలో 3.70 నుంచి 5.32 లక్షల వరకు రైతుల సంఖ్య పెరుగడంతో పాటు రూ.418.70 కోట్ల నుంచి రూ.623.59 కోట్లకు పెట్టుబడి సాయం పెరిగింది. ఇలా ఈ ఐదేండ్లలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద రూ.5,856 కోట్లు పెట్టుబడి సాయం కింద అందజేసింది. దీనికి కారణం ప్రతి సీజన్లో రైతు బంధు కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ప్రతి గుంటకు సాయం అందించడమే.
రైతుల సంఖ్య తగ్గుతూ వస్తుంది
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ పథకంలో ప్రతి ఏడాది ఈ రైతుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇందుకు కారణం కొత్తగా రైతుల నమోదు లేకపోవడమే. అదే రైతు బంధులో మాత్రం ప్రతి సీజన్లో కొత్త దరఖాస్తులకు అవకాశం ఉన్నందున ఆ రైతుల సంఖ్య తగ్గకపోగా పెరుగతూ వస్తున్నది. అయితే కేంద్రం ఇచ్చే సాయం మొదటి నుంచి రెండు వేలు మాత్రమే. అదే రాష్ట్రంలో మాత్రం ఎకరాకు రూ.4 నుంచి రూ.5వేలు సీజన్కు పెంచి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నది.
– సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ