‘నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలోనే ఉన్నది. నేను మర్చిపోలే, నా డ్యూటీ అయిపోలే, భూపాల్ రెడ్డి డ్యూటీ కూడా కాలే. కచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే ఇంకా ఎన్నో రెట్ల అభివృద్ధి చేస్తాం. మంచి పద్ధతిలో నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. దీన్ని ఇట్లనే కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి ఆగమైతే నష్టపోయేది నల్లగొండనే. మరోసారి ఆశీర్వదిస్తే కష్టపడి పని చేసి మీరు ఊహించనంత అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు.
నల్లగొండలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. నల్లగొండ అభివృద్ధిని ఓర్వలేని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డబ్బు అహంకారంతో ప్రగల్భాలు పలుకుతున్నాడని, కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి ఆగమాగం కావద్దని ప్రజలను కోరారు. ఓడినా, గెలిచినా నిత్యం జనం మధ్యలో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డిని మరోసారి గెలిపించి, నల్లగొండ అభివృద్ధిని సంపూర్ణం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నకిరేకల్, నల్లగొండలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభలు విజయవంతమయ్యాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన జనంతో సభ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. సీఎం కేసీఆర్
ప్రసంగానికి జనం జేజేలు పలికారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): నల్లగొండ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో మర్రిగూడ బైపాస్ వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రంగా మారింది. తండోపతండాలుగా జనం రావడంతో చీమలదండును తలపిస్తూ ప్రజా ఆశీర్వాద సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. నార్కట్ పల్లి-అద్దంకి రహదారితో పాటు ఎటు చూసిన గులాబీ జాతరను తలపి ంచింది. నకిరేకల్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్ సాయంత్రం 4.57 గంటలకు వేదిక మీదకు చేరుకోగా అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలు, కేరింతలతో స్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఓటు అనేది నల్లగొండ భవిష్యత్తును, మీ అందరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అభ్యర్థులు, వారి గుణగణాల గురించి ఆలోచించాలి. భూపాల్రెడ్డి కంటే ముందు ఒకాయనకు 20 ఏండ్లు అవకాశం ఆయన ఏమీ చేసిండు…భూ పాల్రెడ్డి ఏం చేసిండు..వీరి మంచిచెడ్డలేందని మీరు విచారించాలి. అభ్యర్థుల వెనకాల ఏ పార్టీలు ఉన్నాయి.. ఆ పార్టీల చరిత్ర ఏంది..పార్టీని దృక్పథం ఏంది.. ఏ పార్టీలు ప్రజల గురించి ఏం ఆలోచిస్తాయో చర్చ పెట్టాలి. అన్ని ఆలోచించి జనం కోసం పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థ్దులను, సర్కార్ను మళ్ల గెలిపించుకోవాలి‘ అని పిలుపునిచ్చారు.
‘నేను పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ల మీటింగ్కు వచ్చినప్పుడు మీకో మాట చెప్పిన..నల్లగొండను నేనే దత్తత తీసుకుంటా..బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పా. మధ్యలో కరోనా వచ్చి ఇబ్బందైంది. ఆ తర్వాత నల్లగొండ ఎట్ల ఉందో చూస్తున్నరు. మీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకొచ్చిండు…తర్వాత మంత్రి కేటీఆర్ను తీసుకొచ్చిండు. ఒక నల్లగొండ పట్టణానికి రూ.1,400 కోట్లు మంజూరు చేయించి చేస్తున్న అభివృద్ధ్ది అంతా మీ కండ్ల ముందు ఉంది’ అని సీఎం కేసీఆర్ వివరించారు. నల్లగొండకు ఐటీ టవర్ వచ్చేసింది. అందులో 1,500 మంది పిల్లలకు ఉద్యోగాలు దొరకుతయ్.
మరిఅంతకు ముందుకు రెండు దశాబ్దాలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నడు. ఆయన టైమ్లో నల్లగొండ పట్టణం ఎట్లుండే. వట్టిగా అడ్డం పొడుగు మాట్లాడుడు కాదూ… పని ఏం జరిగింది. ఎవ్వరూ ఏం చేస్తున్నరో ఆలోచించాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పారు. నల్లగొండ పట్టణంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులున్నరు. మీ అందరిని కూడా నేను కోరుతున్న. నల్లగొండ పట్టణం ఇవ్వాళ నగరం లాగా కనిపిస్తుంది. బ్రహ్మాండంగా డెవెలప్మెంట్ జరుగు తుంది. ఇలాంటి మంచి అభివృద్ధ్దిని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచొవద్దని సీఎం కేసీఆర్ సూచించారు.
‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్బాలు మీకు తెలుసు.. వాళ్లది డబ్బు అహంకారం. ఆ అహంకారంతోని నకిరేకల్లో ఏదేదో మాట్లాడిర్రట. ‘ఇంతకు ముందే నకిరేకల్లో తెలిసింది నాకు… వాళ్లు నకిరేకల్లో గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్ వరకు అందర్ని పండబెట్టి తొక్కుతామని మాట్లాడుతున్నారట. అయితే పండబెట్టి తొక్కె వాళ్లు కావాలా ఎమ్మెల్యేలు కావాలా? ప్రజల మధ్య ఉండే వాళ్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. ‘భూపాల్రెడ్డి ఓడినా… గెలిచినా… ప్రజల మధ్య ఉండే మనిషి. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఓడిపోతే ఆయన హైదరాబాద్కు పోలే… నల్లగొండలో అదే ఇంట్లో ఉన్నడు. ఇవ్వాళ కూడా అదే ఇంట్లో ఉండు… తప్పా ఇల్లు మార్చలేదు. ప్రజల మధ్య ఉండి మీ మధ్య తిరిగే వాళ్లు భూపాల్రెడ్డి కావాలో.. గెలిచిన తర్వాత హైదరాబాద్లో పండేటోళ్లు కావాలో… ప్రజలే దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో నల్లగొండలో ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో ఆముదం పంటే కనిపించేది. నేను ఇవ్వాళ హెలికాప్టర్లో వస్తుంటే ఎటూచూసినా యాసంగి పంటకు తడిపిన నీళ్లతో పొలాలు కనిపిస్తున్నయ్. నల్లగొండ ఖర్మానికి అప్పుడు అట్లుండే అని గతాన్ని గుర్తు చేస్తూ…ఈ రోజేమో బ్రహ్మాండంగా వరి పంట పండుతుందని చెప్పారు. ‘50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఏది సక్కగ లేకుండే. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. సాగునీరు లేదు..భూదాన్పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతులు ఆకలి చావులు… ఇట్లా కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలే ఉండే. యావత్ నల్లగొండ బిడ్డలంతా హైదరాబాద్ పోయి ఆటోలు నడుపుకుంటూ కూలీ నాలి చేసుకుంటూ బతికిన రోజులే. సీఎం కేసీఆర్ కన్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్న చాలా మంది ముఖ్యమంత్రుల అయ్యారు. కానీ ఎవ్వరూ కూడా నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు ఎందుకు తాపియ్యలే. కృష్ణా, గోదావరి మధ్య ఉండే నల్లగొండకు సాగునీళ్లు ఎందుకు ఇవ్వలేదు. కానీ ఇవ్వాళ బీఆర్ఎస్ సర్కార్ కష్టపడితే ఎట్ల వచ్చినయో ఆలోచించాలి.’ అటూ కేసీఆర్ ప్రజలకు సూచించారు.
వైద్యపరంగా ఎన్నో చేస్తున్నం. 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నల్లగొండలో లేదు. కానీ ఇవ్వాళ 3 మెడికల్ కళాశాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినయ్. నల్లగొండలో మెడికల్ కాలేజీతో పాటు బ్రహ్మాం డంగా 500, 600 బెడ్లతో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రైతాంగానికి కూడా మనవి చేస్తున్నా. బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ఇవ్వాళ పూర్తి కావోస్తుంది. ఉదయం సముద్రం గతంలో ఎట్ల ఉండే.. ఉదయ సముద్రం కింద ఎంత చక్కటి పంటలు పడుతున్నయ్. వీటిన్నింటినీ మీరు ఆలోచించాలి. కులం, మతం లేకుండా అన్ని మతాల వారిని అన్ని కులాల వారీని సమానంగా గౌరవిస్తూ ఓ పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని ముందకు తీసుకుని పోతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. కనగల్ కాని, తిప్పర్తిగాని..నల్లగొండ రూరల్ రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి. కాంగ్రెసోళ్లు వస్తే మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటార్లు, ధరణి ఎత్తేసుడూ ఇలా ఆగమాగం చేస్తామని ఇప్పుడే చెప్తున్నారు.
అధికారంలోకి రాగానే ఇండ్లు లేని పేదలందరికీ ఒక టాస్క్లా ఇండ్లు కట్టించే బాధ్యత తమదని చెప్పారు. ఆర్టీసీ బిడ్డలను గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాం. ఆటోవాలాలకు పర్మిట్, ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తూ ఏడాదికి రూ.1,200ల భారం నుంచి ఉపసమనం కల్పించనున్నట్లు ప్రకటించారు. నల్లగొండ ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో కర్ప్యూలు, గొడవలు అనేక ఇబ్బందులు ఉండేవని, ఈ పదేండ్లల్లో ఒక్క కర్వ్యు కూడా తావివ్వకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. అలాగే మైనార్టీ రెసిడెన్షియల్స్ పెట్టి విద్యార్థ్ధులకు విద్యనందిస్తున్నామన్నారు.
తెలంగాణలో నీతి, నిజాయితీతో అల్లా దయతో దయతో తెలంగాణ అత్యంత వైభవంగా ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. కంచర్ల భూపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రాష్ట్ర నేతలు చాడ కిషన్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్కుమార్, నిరంజన్వలీ, కటికం సత్తయ్యగౌడ్, సుంకరి మల్లేశ్గౌడ్, పాల్వాయి స్రవంతి, గోలి అమరేందర్రెడ్డి, జి. వెంకటేశ్వర్లు, బొర్ర సుధాకర్, శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, సింగం రాంమోహన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.