దేవరకొండ : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం అని టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 12మందికి రూ.3.20లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఆయన అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నదని ఆయన తెలిపారు.
ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ దవాఖానల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోందని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, ఉజ్జిని సాగర్ రావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ,రమావత్ మోహన్ కృష్ణ, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, వాడిత్య బాలు, శంకర్ నాయక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.