ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే
మిగిలింది. జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు,
ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డిమాండ్లకు మోక్షం లభించ లేదు. జిల్లాకు సంబంధించి ఒక్క కేంద్ర
విద్యాలయానికీ చోటు లేదు. వైద్యపరంగానూ ఊరట లభించలేదు. వ్యవసాయ రంగంలోనూ పెద్దగా ఆశలు లేవు. కాగా వేతనజీవులకు ఐటీ పరిమితి పెంపుతో స్వల్ప ఊరట లభించగా ఇండ్లు లేని నిరుపేదలకు ఆవాస్ యోజన ద్వారా ప్రయోజనం చేకూరనున్నది. ఇక ఉపాధి హామీకి గతంతో పోలిస్తే నిధులు పెంచడంతో అదనపు పనిదినాలు లభించవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. రైల్వే ప్రాజెక్టులపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్నికల ముందర నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరుత్సాహంగా, నిరాశపూరితంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు కీలకమైన పలు ప్రాజెక్టులకు ఎన్నికల తరుణంలోనైనా ప్రాధాన్యం దక్కుతుందని ఆశించారు. ప్రపంచంలో అత్యంత అధికంగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడు నియోజకవర్గానికి గతంలోనే ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ను ప్రకటించారు. ఇంతకుముందే చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శంకుస్థాపన చేసినా.. ఈ సారి కూడా దాని ప్రస్తావన కనిపించలేదు.
దేశంలోనే ఇక్కత్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఐఐహెచ్టీతో పాటు చేనేతపై విధించిన జీఎస్టీ విషయంలోనూ కేంద్రం పట్టించుకోలేదు. ఐఐహెచ్టీ ప్రకటిస్తే పోచంపల్లికి ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించగా నిరాశే మిగిలింది. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో డిమాండ్లుగా ఉన్న పలు విద్యా సంస్థలకు ఈ సారి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపైనా ముందడుగు లేదు. బీబీనగర్లోని ఎయిమ్స్ నిధులపై స్పష్టత రావాల్సి ఉంది. వీటితో పాటు నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయాలు, చలకుర్తి నవోదయ విద్యాలయాల అప్గ్రేడేషన్ డిమాండ్లు అలాగే ఉన్నాయి. ఇక రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,071 కోట్లు కేటాయించగా అందులో ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులపై స్పష్టత లేదు. పింక్ బుక్ వస్తేనే గానీ ఏం ప్రాజెక్టులు, నిధులు వచ్చాయో క్లారిటీ వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
గత బడ్జెట్లో భారీగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించగా ఈ సారి పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.13వేల కోట్ల నిధులను పెంచారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక ప్రయోజనం నల్లగొండ కూలీలకు అదనపు పనిదినాలు దొరుకనున్నాయి. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదలకు ఇండ్లు అందనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేండ్లలో 20వేల ఇండ్లు ఆవాస్ యోజన ద్వారా పేదలకు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. ఇక సోలార్ ప్రవర్ గ్రిడ్ ద్వారా రూప్ టాప్ సోలార్ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేలా బడ్జెట్లో ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేస్తే నాలుగు లక్షల మందికి ప్రయోజనం జరుగనుంది. 300 యూనిట్ల వరకు ఇస్తే అదనంగా మరో 50వేల కనెక్షన్లకు ప్రయోజనం జరుగుతుందని అంచనా. ఆశ వర్కర్లు, అంగన్వాడీలను ఆయూష్మాన్ భారత్ పథకంలోకి తీసుకువస్తున్నట్లు చేసిన ప్రకటన ఊరటనివ్వనుంది. ఇక ఉద్యోగుల ఐటీ పరిమితి 7లక్షల రూపాయలకు పెంచడం పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నది. దీని వల్ల అదనంగా మరో 12వేల మంది ఐటీ చెల్లింపుదారులకు ఊరట లభించనుందని అంచనా. పెట్రోలియం ఉత్పత్తుల ధరల అదుపుపై ప్రకటన లేకపోవడంతో నిరాశకు గురిచేస్తున్నది.
దేశంలో అత్యధికంగా 70శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి 1.27లక్షల కోట్లు మాత్రమే కేటాయించడంతో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరోసారి రుజువైంది. కేంద్ర బడ్జెట్ ప్రజలు కోరుకున్నట్లు, ఊహించినట్లు లేదు. దేశానికి బీజేపీ ప్రభుత్వం చేసింది తక్కువ.. పొగడ్తలు ఎక్కువ అన్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నది. పేద, మధ్య తరగతి వర్గాలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఖర్చుల కోసం అప్పులు చేస్తుందని తేటతెల్లమైంది. విదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగినట్లు చెప్పింది. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న వేతన జీవులకు ట్యాక్స్ రిలాక్సేషన్ విషయంలో మొండి చేయి చూపి ఆ వర్గాలను మరోసారి నిరాశకు గురి చేసింది.
– బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీలా ఉన్నది. దీంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ ఐదేండ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఎంత మాత్రం ప్రయోజనం జరుగలేదు. ఐదేండ్ల కాలంలో సాధించిన పురోగతి గురించి చెప్పారు గానీ.. దాని ద్వారా ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరిగిందో చెప్పలేదు. సాగుకు పెట్టుబడులు పెరుగడం, పంటలకు మద్దతు ధరలు రాకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. బడ్జెట్లో మార్కెట్ స్థిరీకరణ, వడ్డీలేని వ్యవసాయ రుణాల ప్రస్తావన లేకపోవడం శోచనీయం.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలు, కనీస వేతనాల పెంపునకు కృషి చేయలేదు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించలేదు. పన్ను చెల్లించే వేతన జీవులకు ఎలాంటి ఉపశమనం లేదు. కార్పొరేట్ శక్తులకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉన్నది. మొత్తంగా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేలా ఉన్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్తో ఎలాంటి ప్రయోజనం లేదు.
– ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి, నల్లగొండ
గత బడ్జెట్లో వార్షిక తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగిందని చెప్పారు. కానీ.. తొమ్మిదేండ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురవుతూనే ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుచుటకు కేంద్ర బడ్జెట్లో తగిన చర్యలు రూపొందించలేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలతో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు.
ప్రస్తుతం మన దేశ జీడీపీలో ద్రవ్యలోటు 5.8 శాతం ఉన్నదని చెప్పారు. ద్రవ్యలోటు పూరించుటకు ఏం చర్యలు తీసుకుంటున్నారో బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఐదేండ్లుగా ద్రవ్యోల్బణం పెరిగినా వేతన జీవులకు ప్రామాణిక తగ్గిపు (స్టాండర్డ్ డిడక్షన్) పరిమితి పెంచలేదు. కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. చిన్న, మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదు. విద్య, వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై దృష్టి సారించలేదు. ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపరిచే ప్రణాళికలేవీ ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు.
ఎనిమిది సంవత్సరాల నుంచి ఇన్కం ట్యాక్స్ స్లాబ్లలో పెద్దగా మార్పులు చేయని కేంద్ర ప్రభుత్వం.. ఈ సారి కూడా వేతన జీవులకు నిరాశే మిగిల్చింది. కార్పొరేట్ పన్ను మాత్రం 30 నుంచి 22శాతానికి తగ్గించి వేతన జీవుల పన్ను స్లాబ్లలో మార్పులు చేయక పోవడం దారుణం. సంపన్నులకు ఊడిగం చేస్తూ పేదలను కష్టాలకు గురిచేసే సర్కారుకు భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదు.