రూ.5.30 కోట్లతో నిర్మాణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇటీవలే దీని సమీపంలో ఇండోర్స్టేడియంను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకు రాగా తాజాగా నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కానుంది. 2009లో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి జయపాల్రెడ్డి రూ.2కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2 ఎకరాల స్ధలంలో ఈ భవన నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేయగా ఆనాటి నుంచి పనులు అరకొరగా సాగాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అప్పటి నల్లగొడ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే భాస్కర్రావులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీ ్డ తన నిధుల నుంచి రూ.1.30కోట్లు, టీయూ ఎఫ్ఏడీసీ పథకం క్రింద రూ.2కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం మినీ రవీంద్రభారతి పనులు బయట భాగం, పైకప్పు పూర్తి కాగా లోపల భాగంలో స్టేజి నిర్మాణం కూర్చునే సౌకర్యాలను చేపడుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక
పట్టణంలో నిర్మితమవుతున్న ఈ మినీ రవీంద్రభారతి పలు సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కానుంది. కొన్ని నెలల్లో పనులు పూర్తి చేసుకుని ప్రజలకు వినోదాన్ని అందిం చేందుకు యుద్దప్రాతిపదికన సిద్ధమవుతు న్నది. ఇటీవలే మాజీ ఎంపీ గుత్తాసుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావులు సందర్శించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సైతం ఆదేశించారు.
ఆరు నెలల్లో పనులుపూర్తి: సాయిలక్ష్మీ, మున్సిపల్ డీఈ, మిర్యాలగూడ
మిర్యాలగూడలో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తాం. ఇందు కోసం కాంట్రాక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసి త్వరితగతిన పనులు అయిపోయేలా చర్యలు తీసుకుంటున్నాం.