నీలగిరి, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా మూడు అంతర్రాష్ట్ర, ఐదు అంతర్ జిల్లా చెక్ పోస్టులను, 31 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నది. దీంతో ఇప్పటి వరకు 11 కోట్ల మేర నగదుతోపాటు వివిధ రకాల బంగారు అభరణాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 400 పైచిలుకు కేసుల్లో 847 మంది అనుమానితులను బైండోవర్ చేశారు. వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి లైసెన్స్ కలిగిన 116 ఆయుధాలను డిపాజిట్ చేయించారు.
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి 116 ఆయుధాలను డిపాజిట్ చేయించారు. 187 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమించి ప్రత్యేక దృష్టి సారించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. బెల్టు షాపులన్నింటినీ మూసివేయడంతోపాటు నిరంతర నిఘా ఏర్పాటు చేసి మద్యం ప్రవాహం ఓటర్లపై ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 140 కేసులను నమోదు చేయడంతోపాటు రూ.26.25లక్షల విలువ కలిగిన 44వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.
ఓటర్లపై డబ్బు ప్రవాహం ఉండకుండా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. జిల్లాలో నాగార్జునసాగర్, వాడపల్లి, అడవిదేవులపల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిట్యాల మండలం గుండ్రాంపల్లి, డిండి, సాగర్, మాల్ వద్ద అంతర్ జిల్లాల చెక్పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్చారు. అంతేకాకుండా 19 స్టాటికల్ సర్వేలైన్స్, 12 స్పెషల్ సర్వేలైన్స్ టీమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఫిర్యాదులు చేసేందుకుగాను కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08682 221300, టోల్ఫ్రీ నెంబర్ 18004251442 ఏర్పాటు చేసి ఎప్పటికప్పడు పటిష్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, మూడు కోట్ల విలువైన వస్తువులు, మరో మూడు కోట్ల నగదు సీజ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే వారితోపాటు ప్రేరేపించే వారిని, రౌడీషీటర్లు, పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగింది. 471 బైండోవర్ కేసులకు సంబంధించి 847 మందిని బైండోవర్ చేశారు. వీరందరిపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. తిరిగి నేరాలకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ నగదును జప్తు చేశారు.
మిర్యాలగూడ, ఏప్రిల్ 28 : ఏపీలోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.1.16లక్షలు పట్టుకున్నారు. టూ టౌన్ సీఐ పి.నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి కారు తనిఖీ చేయగా ఆధారాలు లేకుండా లభ్యమైన రూ.1.16లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దామరచర్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు టాటా ఏస్లో వెళ్తున్న గుట్ట స్వామి వద్ద 140 గ్యాస్ స్టవ్లను స్వాధీనం చేసుకొని జిల్లా ట్రెజరీ ఆఫీసుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.