కోదాడ, డిసెంబర్ 11 : విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, దీంతో పెన్షనర్ల పరిస్థితి దీనంగా మారిందని జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన పెన్షన్ నిబంధనలను సవరిస్తూ పెన్షనర్లపై పూర్తి అధికారం ప్రభుత్వాలు తీసుకునే విధంగా చట్టాన్ని తీసుకు వచ్చిందని దీనిని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు
విశ్రాంత ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఉచిత నగదు రహిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులందరి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం జాతీయ పెన్షనర్ల సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోదాడ యూనిట్ సంఘ సభ్యులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ కోదాడ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, రాజేంద్ర బాబు, లింగన్న, ప్రభాకర్, పొట్ట జగన్మోహన్, జానయ్య, రఘువర ప్రసాద్, విద్యాసాగర్, భ్రమరాంబా, శోభ, నరసయ్య పాల్గొన్నారు.