సీడీఎంఏ సత్యనారాయణ
పనుల పురోగతిపై ఎమ్మెల్యే కంచర్లతో కలిసి సమీక్ష
నల్లగొండ, జూన్ 15 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలన్నారు. పనులను బిట్లుగా విభజించి వేర్వేరు బృందాలతో పూర్తి చేయించాలని సూచించారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పనులు జరిగినప్పుడే త్వరగా పూర్తవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని, ఇంజినీర్ల పర్యవేక్షణ సరిగా లేనందునే ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు. సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వేగంగా పూర్తిచేయాలన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ పనులు అనుకున్నంత వేగంగా జరుగడం లేదని, రహదారుల విస్తరణలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. రహదారులు, డ్రైనేజీలు, ఎలక్ట్రికల్ పనుల విషయంలో ఇంజినీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యవంతంగా చేపట్టాలన్నారు. వల్లభారావు చెరువుకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలని, వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అర్బన్ పార్క్, మర్రిగూడ బైపాస్ జంక్షన్, పాలిటెక్నిక్ కళాశాల కెనాల్ జంక్షన్, అన్నపూర్ణ క్యాంటీన్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. రాజీవ్, రామ్నగర్ పార్కుల పనులు పూర్తయినట్లు చెప్పారు. రహదారుల విస్తరణలో భాగంగా అనువైన స్థలాల్లో బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయిలెట్స్, స్ట్రీట్ వెండర్స్ కోసం షెడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కళాభారతి, వల్లభారావు చెరువు, జంక్షన్ల డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా వారు వీక్షించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారి, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ఏజన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.