బట్టుగూడెంలో 100 ఎకరాల్లో సాగు
యాసంగిలో ప్రత్యేక పంట
ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి
రూ.35వేల నుంచి 40వేల వరకు ఆదాయం
పంట మార్పిడికిప్రాధాన్యమిస్తున్న గ్రామ రైతులు
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తుండడంతో కొంత మంది రైతులు పూర్వపు పంటల వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామం ఆముదం సాగుకు కేరాఫ్గా నిలిచింది. ఈ గ్రామ రైతులు రెండేండ్ల నుంచి యాసంగిలో ఆముదం పంటను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెద్దవూర, మే 22 : మండలంలోని బట్టుగూడెం గ్రామ రైతులు వానకాలం పత్తి సాగు చేసి.. యాసంగిలో ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా మినుములు, ఆముదం, వేరుశనగ, జొన్నలు, పెసర, చిల్లి కందులు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు. రెండేండ్లుగా వానకాలం పత్తి పంట పూర్తి కాగానే సంక్రాంతి తర్వాత యాసంగిలో రెండో పంటగా హైదరాబాద్ నుంచి కొత్త వంగడాలను తెచ్చి ఆముదం సాగు చేస్తున్నారు. కాయల నుంచి గింజలు, పొట్టును వేరు చేయడానికి ట్రాక్టర్ యంత్రాలు రావడంతో పని సులువవుతుంది. దీంతోపాటు మంచి ఆదాయం వస్తుండడంతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆముదం సాగుకు ఎకరానికి పెట్టుబడి రూ.20వేల నుంచి 25 వేల రూపాయల వరకు అవుతుందని, దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తుందని రైతులు తెలిపారు. మార్కెట్లో ఆముదానికి మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు రైతుల ఇంటి వద్దకే వచ్చి క్విటాలుకు రూ.6100 నుంచి 6300 వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
రెండేండ్లుగా ఆముదం సాగు చేస్తున్నా..
రెండేండ్ల నుంచి యాసంగి పంటగా ఆముదాలను సాగు చేస్తున్నా. మొదటి పంటగా పత్తిని సాగు చేసి ఆ పంట పూర్తి కాగానే ఆముదం వేస్తున్నా. పంట మార్పిడి భూమికి మంచి సారం ఇస్తుంది. పోయిన సంవత్సరం నాలుగెకరాల్లో సాగు చేస్తే ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 6 ఎకరాల్లో సాగు చేస్తే 48క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.6200 ధర పలికింది. ఈ సంవత్సరం గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఆముదం సాగు చేశారు.
– కూన్రెడ్డి వెంకట్రెడ్డి, రైతు, బట్టుగూడెం
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. యాసంగిలో వరికి బదులు ఇతర పంటల వైపు దృష్టి సారించాలి. మండలంలోని బట్టుగూడెం గ్రామ రైతులు యాసంగిలో ఎక్కువగా ఆరు తడి పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను వేయడం ఎంతో లాభదాయకం.
– సందీప్కుమార్, మండల వ్యవసాయాధికారి, పెద్దవూర
ఎకరాకు రూ.38వేల ఆదాయం
ఈ సంవత్సరం వానకాలం 10 ఎకరాల్లో పత్తి పంట వేశాను. ఆ పంట పూర్తి కాగానే జనవరి 20న ఆముదం సాగు చేశాను. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి క్వింటాలుకు రూ.6100 చెల్లించి కొనుగోలు చేశారు. పెట్టుబడి పోను ఎకరానికి రూ.38 వేల ఆదాయం వచ్చింది. ఈ సారి వానకాలంలో మిర్చి పంట వేస్త్తా. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి వస్తుంది. – కత్తి ముత్యాల్రెడ్డి, రైతు, బట్టుగూడెం