చండూరు, జనవరి 12 : సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మందికే తెలుసు. పందెం కోళ్ల పెంపకానికి ఉడుతపల్లి కేరాఫ్గా మారింది. ఇక్కడి కోళ్లు బరిలోకి దిగాయంటే ఆంధ్రాకోళ్లను చిత్తు చేసి పై చేయిగా నిలుస్తున్నాయంటూ పెంపకం దారులు చెబుతున్నారు. ఉడుతలపల్లిలో కోడి పందేలు జరుగకపోయినా ఇక్కడ పెంచిన కోళ్లను ఆంధ్రాకు విక్రయిస్తుంటారు. ఔత్సాహికులు వేల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. కొందరు గ్రామస్తులు ఇక్కడి కోళ్లను సంక్రాంతి వేళ ఆంధ్రా ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించడం, పందెం కాయడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలు కోళ్లను తరలించగా ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది పెంపకందారులు ఆంధ్రాకు తమ కోళ్లను తీసుకెళ్లనున్నారు.
ఉడుతలపల్లి గ్రామంలో చాలా మంది కూలీలు చెరకు కొట్టడానికి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో అక్కడ కోడి పందెం, కోళ్ల పెంపకాన్ని అలవాటు చేసుకున్నారు. ఇంటికి వచ్చేప్పుడు కోడి పిల్లలను తీసుకొచ్చేవారు. వాటిని 8 నెలల నుంచి ఏడాది పాటు పెంచేవారు. ఇక్కడ కోడి పందేలపై నిషేధం ఉండడంతో సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు తీసుకెళ్లి ఆట ఆడేవారు. కోళ్ల పెంపకంలో ఆరితేరిపోయారు. ఒక్కో కోడి పెంచేందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తుంటారంటే ఇక్కడి వారికి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఏకంగా కోళ్ల పెంపకాన్ని ఉపాధిగా కూడా మలుచుకున్నారు.
ఉడుతలపల్లి కోళ్లు రూ. 6 వేల నుంచి రూ.70 వేల వరకు ధర పలుకుతుంటాయి. ఇక్కడ గట్టి నేలలు ఉండటంతో పెరిగే నాటు కోళ్లు కూడా ధృడంగా ఉంటాయి. ఆంధ్రాలో సారవంతమైన, మృదువైన నేలలు ఉండటంతో అక్కడి వాటితో పోలిస్తే తెలంగాణ కోళ్లే గట్టిగా ఉంటాయని, ఫైటింగ్లో కూడా చురుగ్గా పాల్గొంటాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. అందుకే తెలంగాణ కోళ్లు అంటే అక్కడి వారు చాలా మక్కువ చూపిస్తుంటారని అంటున్నారు.
చిన్న పిల్లలుగా తెచ్చిన కోళ్లను పెందెంలో పాల్గొనే వరకు అంటే కనీసం ఏడాది కాలం వరకైనా పెంచుతుంటారు. నెలకు వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంటారు. గుడ్లు, మాంసకృత్తులు, బాదం, పిస్తా, ఇతర దానాలు పెట్టి బలంగా పెంచుతారు. నీటి సంపులో ఈత కొట్టించటం, అపుడప్పుడు పెంచుతున్న స్థలంలోనే పందేలను ప్రాక్టీస్ చేయించడం వంటివి చేస్తుంటారు. కోళ్లలలో కూడా భీమవరం మెట్టువాటం, డేగ, నెమలి, కాకి నెమలి, కాకిడేగ అని పలు రకాలు ఉంటాయి. పెరు దేశ నుంచి క్రాస్ బీడ్ ద్వారా వచ్చే జాతి పందెం కోళ్లకు భలే డిమాండ్ ఉంటుందని పెంపకం దారులు చెప్పారు.