హాలియా, నవంబర్ 14 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం అనుములలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. 2020లో దురదృష్టవశాత్తు నాన్న, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో 2021 నాగార్జునసాగర్కు ఉప ఎన్నిక వచ్చినట్లు తెలిపారు. ఆ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆశీర్వదించి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత నాన్న ఆశయాన్ని గుర్తుంచుకొని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా శక్తివంచన లేకుండా పని చేసినట్లు తెలిపారు.
ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు ఇవ్వగా వాటితో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని, మరో 40 శాతం పనులు త్వరలోనే పూర్తికానున్నాయన్నారు. ఈ రెండున్నరేండ్లలో నియోజకవర్గంలో విద్య, వైద్యం, ప్రజారోగ్యం, రోడ్లు, తాగు, సాగునీటి వసతులతోపాటు విద్యుత్ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో రెండున్నరేండ్లలోనే చేసినట్లు చెప్పారు. గతంలో ఇంటర్మీడియట్కే పరిమితమైన హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అలాగే 50 పడకల ఆస్పత్రి, మార్చురీ సౌకర్యం కల్పించామన్నారు. నాగార్జునసాగర్లో రూ.18 కోట్లతో కమలానెహ్రూ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా ఆధునీకరించినట్లు తెలిపారు. కేవలం 5 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రూపొందించిన నెల్లికల్ లిఫ్ట్ను 24,886 ఎకరాలకు సాగునీరు అందించేలా రీ డిజైన్ చేయడం జరిగిందన్నారు.
ఈ లిఫ్ట్ నిర్మాణం కోసం ఇప్పటికే రూ.684 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. డీ-8, 9 కాల్వలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే 7,163 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి మరో రూ.300 కోట్లు అవసరం కానున్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ ఫ్లోర్లీడర్ కె.కేశవరావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు కడారి అంజయ్యయాదవ్, కట్టెబోయిన గురువయ్యయాదవ్, బొల్లేపల్లి శ్రీనివాస్రావు, ఎంపీపీలు సుమతీపురుషోత్తం, ఆంగోతు భగవాన్నాయక్, బొల్లం జయమ్మ, మంచుకంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు అబ్బిడి కృష్ణారెడ్డి, సూర్య బాషానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశం, గుండెబోయిన కోటేశ్యాదవ్, మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుషాశరత్రెడ్డి, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు కేవీ రామారావు, కామర్ల జానయ్య, బాబురావునాయక్, కేతావత్ భిక్షానాయక్, పాశం గోపాల్రెడ్డి, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, నరేందర్, గజ్జెల చెన్నారెడ్డి పాల్గొన్నారు.