మిర్యాలగూడ, మార్చి 12 : కాలం కలిసి రాకున్నా, పంటకు సాగు నీరు అందకున్నా.. అష్టకష్టాలు పడి పంట సాగిన రైతాంగాన్ని ఇప్పుడు మిల్లర్లు దోచుకుంటున్నారు. యాసంగి ధాన్యానికి పచ్చ గింజ పేరుతో అతి తక్కువ ధర ఇస్తున్నారు. ఒకవైపు సన్న బియ్యం కింటా రూ.6,500కి పైగా విక్రయిస్తూ.. మరోవైపు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో, నాన్ ఆయకట్టు పరిధిలోనూ బోర్లు, బావుల ఆధారంగా రైతులు యాసంగి వరి సాగు చేశారు. భూగర్భ జలం అడుగంటడంతో ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోనే 10వేల ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. కొద్దోగోప్పో నీటి వసతి ఉన్న రైతులు మడిమడికి పైపులు వేసి ఆరుతడి విధానంలో వరి పండిస్తే తీరా విక్రయించే సమయంలో రైస్ మిల్లర్లు కింటాకు రూ.2,200 నుంచి 2,300లోపే కొనుగోలు చేస్తామని ఖరాకండిగా చెప్తున్నారు.
వారం క్రితం సన్న ధాన్యం రకాలైన చింట్లు, మహేంద్ర చింట్లు, హెచ్ఎంటీ ధాన్యాన్ని రూ.2,600 నుంచి రూ.2,700 వరకు మిల్లర్లు కొనుగోలు చేశారు. రెండు మూడు రోజుల నుంచి వరి కోతలు కొంత ముమ్మరం కావడంతో రైస్ మిల్లుల వద్దకు ధాన్యం ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇదే అదనుగా భావించి మిల్లర్లు సిండికేట్ అయ్యి రూ.2,300కి ధర పెట్టడం లేదు. ఆ ధరకు ఇస్తే ఇస్తే ఇవ్వండి.. లేదంటో వెళ్లిపోండని చెప్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.
వరి కోత యంత్రాల పంట కోయడం వల్ల ధాన్యంలో స్వల్పంగా పచ్చగింజ ఉంటుంది. దాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరను అమాంతం పడేస్తున్నారు. పచ్చగింజ, తేమ, గట్టి తాలు పేరుతో సాకుల మీద సాకులు చూపి రైతులు వేధిస్తున్నారు. మిల్లర్లంతా ఒకే మాట మీద ఉండడంతో రైతులు ఏ మిల్లుకు వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ధాన్యం విక్రయాలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నా ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పర్యవేక్షించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఎకరాకు రూ.25వేలకు గా పెట్టుబడులు పెట్టి నీరు పారక కొత్త బోర్లు వేసుకోని అధిక పెట్టుబడి పెట్టి పంట పండిస్తే మిల్లర్లు దారుణంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలం నేను బోర్ల ఆధారంగా ఐదెకరాల్లో వరి పండించిన. మూ డు ట్రాక్టర్లలో ధాన్యా న్ని మిర్యాలగూడ మిల్లుకు తీసుకొచ్చా. నాలుగు రోజుల క్రితం రూ.2,600 నుంచి రూ.2,700 వరకు ధర పెట్టారు. నా వడ్లు క్వాలిటీ కూడా మంచిగ ఉన్నాయి. అయినా పది మిల్లులు తిరిగినా తక్కువ ధరకే అడిగారు. ఆఖరికి గతిలేక రూ.2,300కు క్వింటా లెక్కన అమ్ముకున్నాను. వ్యాపారులు సిండికేట్గా మారాయి. ఏ మిల్లు దగ్గరకు వెళ్లినా ఒకే ధరకు అడుగుతున్నారు. ఇదేంటని అడిగితే పచ్చగింజ ఉందని సాకులు చెప్తున్నారు. అమ్మితే అమ్ము లేకపోతే వెళ్లపో అని బెదిరిస్తున్నారు. అధికారులు కూడా స్పందించడం లేదు. రైతుల బాధలు పట్టించుకునే వారు కరువయ్యారు.
-శ్రీనివాస్రెడ్డి, తిమ్మారెడ్డిగూడెం రైతు, వేములపల్లి