చిట్యాల, నవంబర్ 11: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు, సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం అర్థరాత్రి ఓ ట్రావెల్స్ బస్సు (విహారి ట్రావెల్స్, బస్సు నం. ఎన్ఎల్ 01 బీ 3250) 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరుకు బయలుదేరింది. బస్సు వెల్మినేడు శివారులోని హైవేపై ఉన్న బస్బే వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఇంజిన్లో పొగలు రావటంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు ఆపాడు.
ప్రయాణికులను అప్రమత్తం చేసి, బస్సు దిగాలని హెచ్చరించాడు. దీంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. క్షణాల్లో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రా ణాపాయం జరగనప్పటికీ వారి వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలిపోయిపోయింది. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడి, షార్ట్ సర్యూట్ కావడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.