దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం తల్లీకొడుకులు కలిసి మహిళలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు రెండు హత్యలు చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. గతంలో జరిగిన మరో దోపిడీ కేసును కూడా ఛేదించారు. అంతేకాకుండా మరో నలుగురిని హతమార్చేందుకు ఈ ముఠా టార్గెట్ చేసుకున్నట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో నిందితురాలు చాకలి రజిత (38)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఆమెతో కలిసి నేరాలకు పాల్పడిన బాలుడిని జువైనల్ హోమ్కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు.
ఆగస్టు 8న దుబ్బాక మండలం రామక్కపేట శివారులోని వనం నర్సయ్య పొలం సమీపంలో రోడ్డుపక్కన పాక్షికంగా కాలిపోయిన గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికుల ఫిర్యాదుతో దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా కేసులో కీలక ఆధారాలు లభించాయి. మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ (45)గా గుర్తించారు.
విజయ ఒంటరిగా నివసిస్తుండటాన్ని గమనించిన రజిత, బాలుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 8న సాయంత్రం కిరాణా దుకాణంలోకి పిలిపించి గొంతు పిసికి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అదే రాత్రి మృతదేహాన్ని టీవీఎస్ ఎక్స్ఎల్పై రామక్కపేట శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే తరహాలో మే 28న డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసించే కుంట రేఖను కూడా హత్య చేసి అచ్చుమాయిపల్లి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చివేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో దుబ్బాక ప్రాంతంలో జరిగిన రెండు హత్యలకు ఒకే ముఠా కారణమని పోలీసులు నిర్ధారించారు.
జూన్ 2025లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వెంచర్లో వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి మెడలోని సుమారు ఐదు తులాల పుస్తెలతాడును దొంగిలించింది కూడా వీరేనని పోలీసులు తెలిపారు.
ఈ తల్లి, కొడుకు వ్యవహరించిన తీరు పోలీసులనే విస్తుపోయేలా చేసింది. టీ పాయింట్ల వద్ద కూర్చొని ప్రజల కదలికలను గమనించడం, వారి ఆస్తులు, కుటుంబ సమస్యలు, గొడవల గురించి ఆరా తీయడం చేసేవారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలను గుర్తించి దోచుకోవడంతో పాటు అవసరమైతే హత్య చేసేవారని వెల్లడించారు. హత్య తర్వాత అనుమానం తమపై రాకుండా వేరే వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చేలా పరిస్థితులను సృష్టించేవారని తెలిపారు.
ఇప్పటికే రెండు హత్యలు చేసిన ఈ ముఠా.. భూంపల్లి గ్రామానికి చెందిన మరో నలుగురిని కూడా హతమార్చేందుకు టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. భూమి వివాదాలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, ఒంటరిగా వాకింగ్కు వెళ్లడం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని బాధితులను ఎంపిక చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, రూ.1.03 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నీలిరంగు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం ఉన్నాయి.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. గతంలో జరిగిన మరో హత్య, దోపిడీ కేసులను కూడా పోలీసులు ఛేదించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన ఏసీపీ రవీందర్రెడ్డి, దుబ్బాక సీఐ రాజేష్, ఎస్ఐలు కీర్తిరాజు, రాజశేఖర్, సతీష్, సైఫ్ అలీ, సీసీఎస్ అధికారులు, టాస్క్ఫోర్స్ సిబ్బందిని సీపీ అభినందించారు. ప్రజలు నిర్జన ప్రాంతాల్లో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని కోరారు. ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద బ్యాకప్తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా బలోపేతం కావడం ఈ కేసు ఛేదనలో కీలకంగా మారిందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.