బొడ్రాయిబజార్, అక్టోబర్ 12 : సమాజంలోని ప్రతి కులానికీ ఒక భవనం ఉండాలని, అది వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఆయన ఆలోచనలను అమలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 19 కుల సంఘాలకు స్థలాలను కేటాయించి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నాంది పలికారు. గత ప్రభుత్వాల్లో ఆయా కులాల నాయకులు ప్రధానంగా పని చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అడిగిందే తడవుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా కులాల ఆత్మగౌరవాన్ని నిలిపేలా కుల సంఘాల భవనాల నిర్మాణానికి అంకురార్పణ చేసింది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్రాహ్మణులకు ఎకరం స్థలంలో రూ.2కోట్లతో బ్రహ్మణ సదన్, కుమ్మరులకు శాలివాహనం భవనం, ఎరుకులకు 14గుంటల్లో రూ.75లక్షలతో నిర్మించిన ఏకలవ్య భవన్ అందుబాటులోకి వచ్చాయి. అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా మొత్తం 19 కుల, ఉద్యోగ, కార్మిక సంఘాల భవనాలకు మంత్రి జగదీశ్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు.
గత ప్రభుత్వాల్లో కుల, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు తమ సంఘాల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు స్థలాలు మంజూరు చేయించి భవనాలకు నిధులు కేటాయించాలని తిరుగని రోజు లేదు. ఆయా పార్టీల్లో పని చేసే నాయకులపై కుల సంఘాలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. తమ పార్టీలోని ప్రజాప్రతినిధులకు విన్నవించలేక, ఇటు కుల సంఘాల్లో పెద్దలకు సమాధానం చెప్పలేక ఆయా కులాల నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అన్ని కులాలు, సంఘాలకు స్థలాలు కేటాయించి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. దీంతో ఆయా కులాల్లో ఆనందం నెలకొంది. తాము అడక్కుండానే సంఘం కార్యకలాపాలకు భవనాలు కేటాయించిన మంత్రి జగదీశ్రెడ్డి వెంటే ఉంటామని కుల సంఘాల నాయకులు ముక్త కంఠంతో చెబుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా కుల సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడంతోపాటు నిధులు మంజూరు చేసింది. పెరిక భవన్కు ఎకరం స్థలంతోపాటు నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేశారు. వైశ్య భవన్కు, గౌడ, రెడ్డి భవనాలకు ఎకరం భూమి, రూ.2కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. పీఆర్టీయూ భవన్ నిర్మాణానికి రూ.50లక్షలు, ముదిరాజ్ భవన్కు 18గుంటల భూమి కోటి రూపాయలు కేటాయించారు. ఎల్ఐసీ ఏజెన్సీ భవన్కు 12గుంటల భూమి, నిర్మాణానికి రూ.50లక్షలు, మేరు భవన్కు 14గుంటల భూమి, రూ.25లక్షలు, మాల కమ్యూనిటీ భవన్కు 20గుంటల భూమి, కోటి రూపాయలు, ఆటో యూనియన్ భవన్కు 29గుంటల స్థలం, కోటి రూపాయలు, మున్నూరు కాపు భవనానికి 19గుంటల స్థలం, రూ.2కోట్లు, దూదేకుల భవన్కు 14గుంటల భూమి, రూ.50లక్షలు, బైక్ మెకానిక్ల యూనియన్ భవనానికి 14గుంటల భూమి, రూ.50లక్షలు, సిక్కు భవన్కు 12గుంటల భూమి, రూ.25లక్షలు, స్వర్ణకారు భవన్కు 12గుంటల భూమి, రూ.25లక్షలు, మోచి భవన్కు 8గుంటల భూమి, రూ.25లక్షలు, భవన నిర్మాణ కార్మిక భవన్కు రెండెకరాల భూమి, రూ.3.50కోట్లు, క్రిస్టియన్ భవన్కు ఎకరం భూమి, 2కోట్ల రూపాయలు కేటాయించారు.
సూర్యాపేట జిల్లాలో మా కులాన్ని గుర్తించి పెద్ద పీట వేసిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డికే దక్కుతుంది. మా కులానికి కోదాడలో భవనం ఉన్నప్పటికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో లేకుండాపోయింది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఎకరం స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు ఇచ్చారు. ఈ భవనం విషయంలో గతంలో ప్రతి సమావేశంలో కులస్తుల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు గర్వంగా తలెత్తుకుంటున్నా.
గత పాలకులు ఎరుకలను చిన్న చూపు చూశారు. మా కులాన్ని పట్టించుకున్న వారే లేరు. ఇక భవనం సంగతి దేవుడెరుగు. తెలంగాణ రాష్ట్రంలో ఎరుకలకు పెద్దపీట వేశారు. మా కులానికి భవనం కావాలని మంత్రి జగదీశ్రెడ్డిని అడగ్గానే 14గుంటల భూమిని ఇచ్చారు. రూ.75లక్షలతో భవనాన్ని నిర్మించారు. అందుబాటులోకి వచ్చిన ఎరుకల భవన్ మా కులస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మమ్మల్ని మనుషులుగా గుర్తించి భవనం నిర్మించి ఇచ్చిన మంత్రి జగదీశ్రెడ్డి మాకు దేవుడితో సమానం. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం.
ఎన్నో ఏండ్లుగా మా కార్మిక సంఘాలకు భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వాల్లోని ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మంత్రి జగదీశ్రెడ్డిని అడిగిన వెంటనే భానుపురి భవన నిర్మాణ కార్మిక భవన్కు రెండెకరాల భూమి కేటాయించి నిధులు మంజూరు చేయడం సంతోషకరం. ఈ భవనం మాకు ఎంతో ఉపకరిస్తుంది. మంత్రి జగదీశ్రెడ్డికి రుణపడి ఉంటాం. కార్మికులమంతా ఆయన వెంటే నడుస్తాం.