దామరచర్ల, మార్చి 16 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన చేయాలన్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, వైద్య విద్యా రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఈ రంగాలకు అరకొర బడ్జెట్ను కేటాయించి దానిలో సగం కూడా ఖర్చు చేయకుండా ఈ రంగాలను నీరుగార్చే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
కాబట్టి అలా కాకుండా అధికంగా నిధులను విడుదల చేయాలన్నారు. వేసవి కాలంలో పండించిన వరి ధాన్యానికి కూడా బోనస్ ఈ బడ్జెట్లో ప్రకటించాలన్నారు. నల్లగొండ జిల్లాలో ఒక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని గిరిజనులకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణ సౌకర్యాలు కల్పించి వారి జీవన ఉపాధికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దయానంద్, ఎర్ర నాయక్, ఖాజా మొహిద్దిన్, సుభాని, వెంకట్ రెడ్డి, చంద్రకళ పాల్గొన్నారు.