కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డిమాండ్లను పట్టించుకున్న పాపానపోలేదు. ఇక బడ్జెట్లో నేతన్నలకు ఒరిగిందేమీ లేదు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్ పట్టలేదు. జిల్లాకు సంబంధించి ఒక్క కేంద్ర విద్యాలయానికీ చోటుదక్కలేదు. వైద్యపరంగానూ ఎలాంటి ఉపశమనం లభించలేదు. వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోనూ ఎరువులపై సబ్సిడీకి మంగళం పాడేలా నిధులను కుదించింది. ఇక ఉపాధిహామీ నిధుల్లో కోత విధించడం ద్వారా జిల్లాలోని కూలీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక రైల్వే ప్రాజెక్టులపై స్పష్టత రావాల్సి ఉన్నా జిల్లా ఎంపీలు చెబుతున్న ప్రకారం ఏ ఒక్క రైల్వే డిమాండ్కు బడ్జెట్లో చోటుదక్కలేదని తెలుస్తున్నది. పింక్ బుక్ వస్తేగానే క్లారిటీ రాని పరిస్థితి. దీంతో కేంద్ర బడ్జెట్పై ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్లో నేరుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రయోజనం కలిగించే ఒక్క అంశం కూడా ప్రస్తావన లేదు. దీంతో ఈ బడ్జెట్ పూర్తి నిరూత్సాహంగా, నిరాశపూరితంగా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాకు కీలకమైన పలు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో కొంత మేరకైనా ప్రాధాన్యత దక్కుతుందని అంతా ఆశించారు. కానీ.. ఏ ఒక్క డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం చెవిన పెట్టకపోవడం గమనార్హం. ప్రతి ఏటా జిల్లా ప్రజల తరఫున ఎంపీలు తమ డిమాండ్లను వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో అత్యంత అధికంగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడు నియోజకవర్గానికి గతంలోనే ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను ప్రకటించారు. గతంలో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శంకుస్థాపన చేసినా.. దాన్ని పశ్చిమబెంగాల్కు తరలించి ఇక్కడి వారికి అన్యాయం చేసింది. ఈ సారైనా మంజూరుకు నోచుకుంటుందని భావిస్తే నిరాశే మిగిలింది. మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ, నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదు.
పోచంపల్లి ఐఐహెచ్టీపై నిరాశ
దేశంలోనే ఇక్కత్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఐఐహెచ్టీతోపాటు చేనేతపై విధించిన జీఎస్టీ విషయంలోనూ కేంద్రం సానుకూలత చూపలేదు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం మొండి చెయ్యి చూపింది. గత ఏడాది యునెస్కో అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లికి ప్రత్యేకంగా దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపునిచ్చింది. దీని ద్వారా అయినా పోచంపల్లికి ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించగా తీవ్ర నిరాశే కలిగింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేత గానీ, ప్రత్యేక ప్రోత్సాహకాలు గానీ కనిపించలేదు.
ఉపాధి హామీకి గండం
బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వరుసగా రెండో ఏడాది కూడా కేంద్రం నిధుల కోత విధించింది. రూ.90వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు తగ్గించి 30వేల కోట్ల నిధులకు ఎసరు పెట్టింది. దీంతో రాష్ట్రంలోనే అత్యధికంగా జాబ్ కార్డుదారులు ఉన్న ఉమ్మడి జిల్లాకు ఎక్కువ నష్టం జరుగనుంది. ఇప్పటికే ఉపాధి హామీ పని దినాలను కుదించగా తాజా కోతలతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లే. దీని వల్ల కూలీలకు ఉపాధి కరువయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
వ్యవసాయంపై అదనపు భారం
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు రైతులపై అదనపు భారానికి కారణం కానున్నాయి. వ్యవసాయానికి గత బడ్జెట్లో రూ.2.25లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.1.75లక్ష కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. ఎరువులు, సబ్సిడీలకు రూ.50వేల కోట్ల నిధులను తగ్గించారు. దీంతో ఎరువులపై మరింతగా సబ్సిడీ తగ్గిపోయి జిల్లాలోని సుమారు 10లక్షల మంది రైతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను పెంచుతామని ప్రకటించినా నెరవేర్చలేదు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు ద్వారా 10లక్షల మందికి ప్రయోజనం జరుగుతుంటే.. పీఎం కిసాన్ సమ్మాన్ను నాలుగు లక్షల మంది రైతులకు కుదించడం గమనార్హం.
రైల్వేలపై స్పష్టత కరువు
రెండు రాష్ర్టాల రాజధానులను కలుపుతూ సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్న ఎన్హెచ్ 65 వెంట రైల్వే లైన్ నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు డిమాండ్ చాలా కాలంగా ఉంది. యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ మార్గం పొడిగింపు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ.. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై బడ్జెట్లో స్పష్టత రాలేదు. పింక్ బుక్ వస్తే గానీ ఏ ప్రాజెక్టులు, నిధులు వచ్చాయో క్లారిటీ వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
విద్యాసంస్థలకు దక్కని ప్రాధాన్యత
ఉమ్మడి జిల్లా పరిధిలో డిమాండ్లుగా ఉన్న పలు విద్యాసంస్థలకు కేంద్రం మొండి చెయ్యే చూపింది. జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను పట్టించుకోలేదు. గతంలో ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసినా.. వరుసగా రెండో ఏడాది కూడా దాని కొనసాగింపు కనిపించలేదు. మరోవైపు వైద్య రంగంలోనూ ఎలాంటి ఆశలు నెరవేరలేదు. బీబీనగర్లోని ఎయిమ్స్ నిధులపై స్పష్టత రావాల్సి ఉంది. వీటితోపాటు నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయాలు, చలకుర్తి నవోదయ విద్యాలయం అప్గ్రేడేషన్ ఊసేలేదు.
ఇది బడా పారిశ్రామికవేత్తల బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది. సామాన్య ప్రజల నడ్డి విరిచి సబ్సిడీల రూపంలో కార్పొరేట్, పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా ఉంది. ఈ బడ్జెట్లో రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఊసేలేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే ఆలోచన కేంద్రం చేయలేదు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా తీసుకున్న నిర్ణయాలు శూన్యం. కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడీల రూపంలో లాభం చేకూర్చేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దేశ రైతాంగానికి, కుల వృత్తుల వారికి, ఉద్యోగులకు ఈ బడ్జెట్ నష్టం చేసేలా ఉంది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగంపై ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణం. ఈ బడ్జెట్తో రాష్ట్రానికి, నల్లగొండ జిల్లాకు ఉపయోగం లేదు.
వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయలేదు
కేంద్ర బడ్జెట్లో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగడం, పంటల దిగుబడులు తగ్గడంతో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. పంటలకు మద్దతు ధర చట్టంపై ప్రస్తావన చేయలేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులపై సబ్సిడీ తగ్గించడం ద్వారా ప్రజలపై మరింత భారం వేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కీలక రంగాలైన విద్య, వైద్యానికి కేటాయింపులు పెంచకపోవడం దారుణం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, బీబీనగర్ నుంచి నడికుడి వరకు డబ్లింగ్ పనుల గురించి ప్రస్తావించలేదు. కాజీపేట-మాచర్ల వరకు గతంలో ప్రతిపాదించిన రైల్వే లైన్కు నిధులు కేటాయించలేదు. బడ్జెట్ అంతా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదిగా.. పేద, మధ్య తరగతి ప్రజలకు అనేక భారాలు మోపేదిగా ఉన్నది. గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థను దెబ్బతీసేదిలా ఉన్నది.
పన్నుల్లో స్లాబ్ పద్ధతి ఏ ఒక్కరినీ వదలరని అర్థం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ను చూడగానే వేతన జీవులకు ఊరటగా కనిపిస్తుంది. కానీ.. దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని తెలుస్తుంది. రూ.7లక్షల వార్షిక వేతనందారులకు పన్ను రిబేటు పరిమితిని పెంచామంటున్నారు సంతోషమే. కానీ.. పన్నుల్లో నూతన విధానం స్లాబ్ పద్ధతి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్లాబ్ పద్ధతి అంటేనే ఏ ఒక్కరినీ వదలరని అర్థం. స్లాబ్ పద్ధతిలో నాలుగు అంచెలు ఉన్నాయి. రూ.3లక్షల వరకు ఏ రకమైన పన్ను లేదు. 3లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం, 6లక్షల నుంచి రూ.9లక్షల వరకు 10 శాతం, 9లక్షల నుంచి రూ.12లక్షల వరకు 15 శాతం, 12లక్షల నుంచి 15లక్షల రూపాయల వరకు 20 శాతం, రూ.15లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను ఉంటుందని స్లాబ్ విధానం ప్రవేశపెట్టారు. ఎవరినీ వదిలి పెట్టకుండా పన్నులు విధిస్తున్న సర్కారు.. వసతుల కల్పనలో మాత్రం తీసికట్టుగా మారింది. పన్నులు విధించడంలో ఉన్న నిజాయితీ సేవల్లో చూపాలి.
– పాదూరు యాదగిరిరెడ్డి, ఉపాధ్యాయుడు (మిర్యాలగూడ రూరల్)
సామాన్యులపై పెను భారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పరోక్ష పన్నుల కారణంగా గోల్డ్, సిల్వర్ తోపాటు దుస్తుల ధరలు పెరిగే పరిస్థితి ఉంటుంది. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేదేమీ లేదు. పేదలు, మధ్య తరగతి, చిరు వ్యాపారులకు చాలా నిరాశాజనకంగా ఉంది. వంట గ్యాస్ ధరల తగ్గింపునకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. బీజేపీ పాలనలో ఏ బడ్జెట్లో కూడా సామాన్యులు, పేదలు, చిరు వ్యాపారుల కష్టాలను పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు మొదటి నుంచీ కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటున్నాయి తప్ప.. పేదలకు చేసిందేమీ లేదు.
ఎన్నికల బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిందానిలా ఉంది. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ర్టాలకు శూన్య హస్తాలు కనిపించాయి. వ్యవసాయానికి రూ.20 లక్షల కోట్లు కేటాయించారు. కానీ.. అది ఆచరణలో చూపించాల్సి ంది. సామాన్యుడి స్థితిగతులను ఏ మాత్రమూ మార్చలేని బడ్జెట్ అనే చెప్పాలి. ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్లో స్లాబ్ను తగ్గించడం కొంత ఊరట కలిగించే విషయం. ఆటోమొబైల్ రంగంలో ధరలు కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. మొత్తం బడ్జెట్ను 2గంటల్లో అంకెలు చదువుతూ ముగించారు. ఇది రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంకెలతో చేసిన బడ్జెట్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
పన్ను మినహాయింపులో నిరాశ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది. ఇది ఎన్నికల బడ్జెట్గానే ఉంది. దేశ ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించేలా లేదు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదు. త్వరలో ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించింది. ఆదాయ పన్నులో రూ.10 లక్షల వరకు మినహాయింపు ఇస్తుందని ఆశించాం. కానీ.. 7లక్షల రూపాయల వరకే మినహాయింపు ఇచ్చి నిరాశ పరిచింది. తెలంగాకు ఈ ఏడాది కూడా సరిపడా నిధులు కేటాయించకపోవడం బాధాకరం.
సామాన్యులకు ప్రాధాన్యత.. ఉద్యోగులకు మొండి చేయి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య మానవునికి ప్రాధాన్యత కల్పించారు. ఇది హర్షణీయమైనప్పటికీ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపించారు. మధ్య తరగతి జీవులకు ఆదాయ పన్ను మార్పులో కొంత ఊరట కల్పించినా పూర్తి తృప్తినివ్వలేదని చెప్పవచ్చు. కేంద్ర బడ్జెట్లో ఏడు అంశాలను ప్రస్తావించినప్పటికీ వ్యవసాయ రంగానికి రూ.20లక్షల కోట్లు కేటాయించినా అది సరిపోదు. దేశంలో 150 నర్సింగ్ కళాశాలలను నెలకొల్పడం, రక్తహీనత నిర్మూలనకు చర్యలు తీసుకోవడం కొంత ఊరట కల్పించింది. ఏకలవ్య, ఆదర్శ గురుకుల పాఠశాలలను నెలకొల్పడంతోపాటు వాటిల్లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పడం సంతోషకరం. ఇలా కొంత మోదం.. కొంత ఖేదం అన్న చందంగానే బడ్జెట్ ఉన్నది.
– కొప్పుల అంజిరెడ్డి, అర్ధశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీయూ (రామగిరి)
ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించేలా ..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించేలా ఉంది. ఆదాయ పన్ను పరిమితి ఆశించిన స్థాయిలో పెంచలేదు. నామమాత్రంగానే పెంచి చేతులు దులిపేసుకున్నది. 2023-24 బడ్జెట్లో విద్య పట్ల చిన్నచూపు చూపించింది. విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా మేక్ ఇన్ ఇండియా విధానం ఎట్ల సాధ్యం. కాగితాలకు పరిమితం అవుతుంది. కానీ.. కార్యాచరణ చేయలేదు. మొత్తం మీద బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేలా ఉన్నది.
– నాగులు వేణు, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు, నల్లగొండ
సగటు జీవిని నిరాశపర్చిన బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలను సంతృప్తి పరిచి, మధ్య తరగతి ప్రజలను అసంతృప్తి పరిచే విధంగా ఉంది. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్య, వైద్య రంగానికి ఎలాంటి కేటాయింపులూ చేయకపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు ద్రవ్యోల్బణంపైనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు అధిక ధరలతో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. చిరు ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు సరిపడ మాత్రమే జీతాలు పెరిగినా ఆ మేరకు పన్ను పోటు కూడా పెరుగుతూ వస్తుంది. పెరిగిన వడ్డీ రేట్లు నెలవారి వాయిదాల రూపంలో భారంగా పరిణమించాయి. ఈ సమయంలో ధరలను తగ్గించే దిశగా బడ్జెట్ ఉంటుందని అంచనా వేసిన సగటు జీవికి నిరాశే మిగిలింది.
– తాటిపాముల నర్సింహమూర్తి, టీఎస్యూటీఎఫ్ జిల్లా నాయకుడు, శాలిగౌరారం