ఈ నెల 14న ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు
హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్మించిన బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న ప్రారంభించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నందికొండ, మే 10 : నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో రూ.50కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నందికొండలో ప్రపంచ స్థాయి బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన బుద్ధవనాన్ని సైతం మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుద్ధవనం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హిల్కాలనీలో 274 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టులో జాతక పార్కు, మహాస్తూపం, ధ్యాన కేంద్రం, అవకాన బుద్ధ లాంటి నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
రాష్ర్టానికే మణిహారం..
బౌద్ధ సంప్రదాయాలకు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే బుద్ధవనం అతి పెద్ద ప్రాజెక్టు. గౌతమ బుద్ధుడి జీవిత విశేషాలు, జాతక కథలతో నిర్మించిన శ్రీ పర్వతారామం రాష్ర్టానికే మణిహారంలా నిలువనున్నది. ప్రాజెక్ట్ ఈ నెల14న ప్రారంభమై పర్యాటకులకు, బౌద్ధభిక్షువులకు అందుబాటులోకి రానున్నది. వాస్తవానికి 2003 సంవత్సరంలోనే బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రారంభమైనా గత ప్రభుత్వాలు కినుక వహించాయి. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బుద్ధవనం పనులు పూర్తి చేయడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేకంగా అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచారు. దాంతో పనులు సకాలంలో పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.