నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో పలు తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.13.90 కోట్లతో ఆరు చోట్ల బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జీఓ 147ను ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో పంచాయతీ రాజ్ ఇంజి నీరింగ్ విభాగం పరిధిలో ఈ రోడ్ల నిర్మాణం జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా గిరిజన తండాలకు అవసరం ఉన్న చోట్ల బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.156.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో రెండు రోడ్లు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు బీటీ రోడ్లను వేయనున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండల పరిధిలో నాగాయపల్లి నుంచి తిమ్మాపురం తండా మీదుగా తిమ్మాపురం వరకు రెండు కోట్లతో బీటీ రోడ్డును వేయనున్నారు.
తుర్కపల్లి మండలం పరిధిలోని ముల్కపల్లి స్టేజీ నుంచి దావోజీతండా మీదుగా గొల్లగూడెం వరకు రూ.4.50కోట్లతో బీటీ రోడ్డు నిర్మించనున్నారు. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలోని పలు తండాలకు నాలుగు రోడ్లు మంజూరయ్యాయి. రూ.2.70కోట్లతో చెన్నాయిపాలెం ఆర్అండ్బీ రోడ్డు నుంచి అల్వాలపాడు తండా వరకు, రూ.2.20కోట్లతో అల్వాలపాడు పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నాదీంతండా పీడబ్ల్యూడీ రోడ్డు వరకు, రూ. 1.50కోట్లతో సత్యంపాడుతండా హైలెవల్ బ్రిడ్జి నుంచి రాజేంద్రనగర్తండా వరకు, ఒక కోటి రూపాయలతో అల్వాలపాడ్తండా హైలెవల్ బ్రిడ్జి నుంచి రాజేంద్రనగర్తండా వరకు బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన నిధులతో ఆయా ప్రాంతాల్లో ఇన్నాళ్లు పడుతున్న రహదారుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దీంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.