హాలియా, ఆగస్టు 23 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచుతానని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండో సారి టికెట్ కేటాయించిన తర్వాత నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యే భగత్ కుమార్కు బుధవారం హాలియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా కొనసాగిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. అందుకే నియోజకవర్గ ప్రజలు 2018లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యను గెలిపించారన్నారు.
దురదుష్టవశాత్తు ఆయన అకాల మరణంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించగా.. ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత రెండేండ్ల కాలంలోనే విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగు, సాగునీరు, వ్యవసాయం, నీటిపారుదల, ఇలా అన్ని రంగాల్లో నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేసినట్లు చెప్పారు. హాలియా, నాగార్జునసాగర్ మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, ఇండోర్ స్టేడియం, డిజిటల్లైబ్రరీ, ఆడిటోరియం ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. 1997లో దివంగత ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ప్రారంభించిన వరద కాల్వను జానారెడ్డి 20 ఏండ్లు అయినా పూర్తి చేయించలేకపోయారన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ పేరు చెప్పి జానారెడ్డి 30 ఏండ్లు ఓట్లు దండుకున్నారే తప్ప లిఫ్ట్ ఏర్పాటు చేయలేక పోయారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుతం ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, అభివృద్ధికే పట్టం కడుతారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు.
భగత్కుమార్ గెలుపు ఖాయం : ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మరోమారు బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్ అన్నారు. ర్యాలీ ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నోముల భగత్ను మరోసారి గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
హాలియా జనసంద్రం
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్కు పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్కు స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనుముల మండలంలోని అలీనగర్ నుంచి హాలియా వరకు 5 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో హాలియా -మిర్యాలగూడ రహదారి జనసంద్రమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తల నృత్యాలు, ఆట పాటలతో హోరెత్తింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవల్లి విజయేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, గుర్రంపోడు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, హాలియా, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, గుర్రంపోడు వైస్ ఎంపీపీ ధనుంజయ్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, రవినాయక్, పిడిగం నాగయ్య, గజ్జల చెన్నారెడ్డి, తాటి సత్యపాల్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నర్సింహయ్య విగ్రహానికి నివాళి
నిడమనూరు : హైదరాబాద్ నుంచి నేరుగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ గ్రామంలోని తన తండ్రి నోముల నర్సింహయ్య సమాధి వద్దకు వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం హాలియాకు వస్తూ నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద ఉన్న దివంగత ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరికలు
హాలియా : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గుర్రంపోడుతో పాటు తిరుమలగిరి(సాగర్) మండలంలోని గుట్టుమీదితండా, సపావత్ తండాలకు చెందిన 80 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హాలియాలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గుర్రంపోడు మండల వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్, గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పిడిగం నాగయ్య, గజ్జల చెన్నారెడ్డి, జిల్లా నాయకుడు భిక్ష్యానాయక్, ప్రవీణ్కుమార్, నల్లబెట్టి పురుశోత్తం, మేకల వెంకట్రెడ్డి, వేణు, సత్యనారాయణరెడ్డి, గోవిందరెడ్డి, రామాంజిరెడ్డి, లింగయ్య, యాదయ్య, శంకర్, సాంబయ్య, మల్లయ్య పాల్గొన్నారు.