‘తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో ప్రగతి సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. వచ్చే ఎన్నికల్లో అవే మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. ప్రజలే మా బలం, బలగం. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. దేశానికే నల్లగొండ జిల్లా ధాన్యాగారం అయ్యింది. దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్ కొత్త వెలుగులు నింపేందుకు సిద్ధమవుతున్నది.
దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. యాదగిరి గుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. కాళేశ్వరం జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేశాయి. జిల్లాలో బీజేపీ నామమాత్రం కూడా లేదు. బలం లేని కాంగ్రెస్ పార్టీనే మాకు ప్రతిపక్షం. పాత ముఖాలు, పాత కిరీటాలు ధరించి కొత్తగా ఏదీ చెప్పుకోలేని దుస్థితిలో ఆ పార్టీ వృద్ధ నేతలు బయలు దేరి వస్తున్నారు. వారిని ప్రజలు ఏనాడో మరిచిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం బీఆర్ఎస్ ఆత్మ విశ్వాసం, బలానికి నిదర్శనం. 2014కు ముందు ప్రస్తుత పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి పలు విషయాలను వెల్లడించారు.
సూర్యాపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ‘గత తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. సమష్టి నాయకత్వమే మా బలం. జిల్లాలో ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రతిపక్షం. పాత ముఖాలు పాత కిరీటాలు ధరించి కొత్తగా ఏదీ చెప్పుకోలేని దుస్థితిలో ఆ పార్టీ వృద్ధ నేతలు బయల్దేరి వస్తున్నారు. వారిని ప్రజలు ఏనాడో మరచిపోయారు. ఇక బీజేపీ నామమాత్రంగా కూడా లేదు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వరుసగా మూడోసారి సూర్యాపేట నుంచి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతోపాటు ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రజలు అన్నీ అనుభవిస్తున్నారు. మూసీ మురుగు నీరే దిక్కైన ఈ ప్రాంతానికి మిషన్ భగీరథతో అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన సురక్షిత కృష్ణాజలాలు అందుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు వేలాది మంది గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడంతో ప్రసూతితోపాటు క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు ఉచిత చికిత్స అందుతున్నది. గతంలో అవుట్ పేషంట్గా అడుగుపెట్టని పీహెచ్సీలు నేడు ప్రసూతి కేంద్రాలుగా మారాయి. పల్లె, బస్తీ దవాఖానలు, పీహెచ్సీల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి.
ప్రజలు సీఎం కేసీఆర్కు హ్యాట్రిక్ ఇవ్వాలనుకుంటుండ్రు..
దశాబ్దాల తరబడి కరువు, కాటకాలు, ఆకలి చావులు, ఇతర సమస్యలతో నరకయాతనపడ్డ జనం ముఖ్యమంత్రి కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారు. మళ్లీ కేసీఆర్నే హ్యాట్రిక్ సీఎంగా కొనాసాగించాలనే కృతనిశ్చయానికి వచ్చిండ్రు. కాంగ్రెస్, ఇతర పార్టీల దశాబ్దాల పాలన, 9ఏండ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకుంటూ కేసీఆర్ నాయకత్వమే తమకు శ్రీరామరక్ష అనుకుంటున్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని డిసైడయ్యారు.
గతంతో పోలిస్తే అభివృద్ధి స్థాయి ఏంటో తెలుస్తుంది
స్వరాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. అన్ని వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, అభివృద్ధి చేయాలన్న తపనతో ఓ పక్క యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, మరో పక్క వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, ఇంకో పక్కన యాదగిరిగుట్ట ఆలయ పునరుద్ధరణ, ఇంకో పక్క సుమారు రెండున్నర లక్షల భూములు సస్యశ్యామలమై వేల కోట్ల పంట పండిస్తున్న కాళేశ్వరం జలాల గలగలలు దర్శనమిస్తున్నాయి.
బీఆర్ఎస్ బాహుబలి పార్టీ..
సాధారణంగా రాజకీయాల్లో బలమైన, బలహీనమైన పార్టీలు ఉంటాయి. అయితే బాహుబలిగా ఉన్న బీఆర్ఎస్కు జిల్లాలో ఏమాత్రమూ బలం లేని, పుంజుకునే అవకాశం లేని కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనగానే పాత నాయకులు, పాత కిరీటాలు ధరించి కొత్తగా బయటకు వస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలి? ఏం చెప్పాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీరు నాడు చేపట్టలేదని ప్రజలు ప్రశ్నిస్తే? ఎలా ఎదుర్కొవాలో తెలియక తికమకపడుతున్నారు.
12కు 12 స్థానాల్లో విజయం సాధిస్తాం
2001లో టీఆర్ఎస్గా ఆవిర్భవించిన పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అనేక పోరాటాలతో చేపట్టిన ఉద్యమాల ఫలితంగా రాష్ర్టాన్ని సాధించాం. నాడు కేవలం ఒక ప్రాంతంలో స్థానిక సంస్థల్లో బరిలో నిలిచి నెమ్మదిగా ఎదుగుతూ అన్ని వర్గాల మద్దతుతో 2014లో 6 స్థానాలు, 2018లో 9 స్థానాల్లో విజయం సాధించాం. ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో గెలిచిన వాటితో జిల్లాలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. రాబోయే ఎన్నికల్లో 12 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం.
2014కు ముందు, తర్వాత పరిస్థితిని గమనించాలి
కొంతమంది ఏ అభివృద్ధి జరుగలేదని కండ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారు. అసలు 2014కు ముందు జిల్లా ఎట్ల ఉంది. ఇప్పుడు ఎలా ఉందన్నది పరిశీలిస్తే అభివృద్ధి ఎంత జరిగిందనేది తెలుస్తుంది. లేకపోతే మన రాష్ట్ర పొలిమెర్లకు వెళ్లి పక్కరాష్ర్టాల అంచులు పరిశీలించినా ఇక్కడి అభివృద్ధి ఏంటో తెలుస్తుంది. జిల్లాకు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులే ప్రధాన ఆదాయ వనరు. వేల సంవత్సరాలు చెరువులు, బావులు, బోర్లు, ఊటకుంటలు, కత్వలతో జిల్లాలో అద్భుతమైన పంటలు పండించిన చరిత్ర ఉండగా, దురదృష్టవశాత్తు 1956 నుంచి క్రమక్రమంగా జిల్లా ముఖ స్వరూపం మారింది. సాగుకు నీళ్లు లేక నెర్రెలు బారిన నేలలు, మసక బారిన జీవితాలు, చివరకు గొంతు తడుపుకొనేందుకు కూడా గుక్కెడు నీటిని ఇవ్వలేని దుస్థితి. తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ఆలోచన, పటిష్టమైన ప్రణాళికలు, ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో సంతోషాన్ని పెంచారు.
ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది
చరిత్రలో ఏనాడూ లేనివిధంగా మూడు నెలల ముందే మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం అంటే.. పార్టీ బలం, అభివృద్ధి ఫలాలను అందుకుంటున్న ప్రజలపై ఉన్న విశ్వాసమే. మాకు ఉన్న సమయంలో గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తాం. అవే మమ్మల్ని గెలిపిస్తాయి. ఎక్కడో ఒకచోట అసమ్మతి సాధారణం, వారిని ఏకతాటిపైకి తీసుకొస్తాం.
కండ్ల ముందు కనిపించేదే నిజం..
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడు ఏం జరిగినా, ఏది కోల్పోయినా, ఎలాంటి లబ్ధి చేకూరినా కండ్లముందు కనిపించేదే నిజం. అనుభవించేదే సత్యం. 65 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీల అనుభవం మీ ముందు ఉంది. కేవలం 9 ఏండ్లలోనే కేసీఆర్ పరిపాలన తెచ్చిన అభివృద్ధి ఫలాలు మీరు అనుభవిస్తున్న వనరులు మీ కండ్లముందు ఉన్నాయి. ఈ రెండూ చూసి భవిష్యత్ను నిర్ణయించుకునే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది. అన్ని వర్గాలు, కుల, మత, వర్ణ భేదం లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేలా చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చుతూ అభివృద్ధిని కొనసాగిద్దాం అంటూ జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.